Krishna Devarayalu Lavu Meet CBN: టీడీపీలో చేరేందుకు సిద్ధమయిన వైసీపీ ఎంపీ, చంద్రబాబుతో నరసరావుపేట ఎంపీ  శ్రీకృష్ణ దేవరాయలు భేటీ, పల్నాడులో వెలిసిన ఫ్లెక్సీలు
Krishna Devarayalu Lavu Meet CBN (PIC@ X)

New Delhi, FEB 08: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Sri Krishna Devarayalu Lavu) టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu Naidu) ఢిల్లీలో కలిశారు. టీడీపీలో (TDP) చేరిక, పోటీపై ఆయన చంద్రబాబుతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. నరసరావుపేట ఎంపీ టికెట్ ను మరోసారి లావు శ్రీకృష్ణదేవరాయలుకు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించింది. గుంటూరు పార్లమెంట్ స్థానంలో పోటీ చేయాలని చెప్పింది. అయితే, అందుకు శ్రీకృష్ణ దేవరాయలు ఒప్పుకోలేదు. ఇటీవలే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడాయన టీడీపీ వైపు చూస్తున్నారు. పొత్తుల అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుతో లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశం అయ్యారు. గంటన్నరపాటు ఈ సమావేశం సాగింది. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు లావు శ్రీకృష్ణదేవరాయలు.

 

మరోవైపు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీకి ఆయన రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఫ్లెక్సీలు వెలిశాయి. లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో చంద్రబాబును ఎంపీ లావు కలిశారు. అదే సమయంలో పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాటు చేయడం విశేషం. నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అభిమానులు.