Karakatta Residence Case: కరకట్ట నివాసం జప్తుపై ముగిసిన వాదనలు, తీర్పును జూన్ 2కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
karakatta House (photo-Video Grab)

Vjy, May 31: ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్, చంద్రబాబు నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. కరకట్ట నివాసం జప్తు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బిందుమాధవి.. తీర్పు జూన్ 2న వెలువరించనున్నారు.

కాగా కరకట్టపై చంద్రబాబు ఇల్లు జప్తునకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ అభియోగాలు మోపింది. కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటిని జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోరింది.

జగన్‌ చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీ వైసీపీ, వివేకా హత్య కేసులో ఓ వర్గం మీడియా అతి ఎక్కువైందని మండిపడిన సజ్జల

ఈ మేరకు సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద మాట్లాడుతూ.. ఏపీ సీఐడీ తరపున 2 పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేశామని తెలిపారు. లింగమనేని రమేష్ ఇల్లు అటాచ్ మెంట్ పిటిషన్ ఒకటి కాగా, మాజీమంత్రి నారాయణ బంధువుల ఆస్తుల జప్తు పిటిషన్‌ మరొకటని తెలిపారు. 1944 ఆర్డినెన్స్‌ ప్రకారం తన పిటిషన్‌పై ఆర్డర్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

నేరం జరిగిందా లేదా అనేది తెలుసుకునేందుకు అవసరమైతే అఫిడవిట్ వేసిన అధికారిని కోర్టు విచారణ చేయవచ్చని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసు ఇచ్చే అవకాశం లేదని చెప్పినట్లు తెలిపారు. జప్తు ఉత్తర్వులు ఇవ్వటమా, నిరాకరించటమా అనేది ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

మరోవైపు తమ వాదనలు వినాలని కోరుతూ లింగమనేని రమేష్ తరపు న్యాయవాది మెమో దాఖలు చేశారు. ఈనెల 17న ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తమకు కాపీలను అందజేయాలని న్యాయవాది కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును జూన్ 2కు వాయిదా వేసింది.