Telangana: తెలంగాణలో రైతుబంధు నిధుల విడుదల, 10 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం, ప్రభుత్వం సూచించిన పంటలే రైతులు వేయటం పట్ల ముఖ్యమంత్రి హర్షం
Image used for representational purpose. | (Photo-PTI)

Hyderabad, June 16:  ప్రభుత్వం సూచించిన మేరకు రాష్ట్రంలోని రైతాంగం అంతా నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున వెంటనే రైతులందరికీ రైతుంబంధు సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వ్వయసాయ పనులు ప్రారంభ మయ్యాయని, రైతు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడవద్దని సీఎం అన్నారు. ఒక్క ఎకరా మిగలకుండా, ఒక్క రైతును వదలకుండా అందరికీ వారం, పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకుని నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేయడానికి సిద్ధపడిన రైతులకు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్, రైతుబంధు డబ్బులను కూడా ఉపయోగించుకుని, వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని కోరారు. వర్షాకాలం పంటల కోసం ప్రణాళిక రూపొందించినట్లుగానే, యాసంగి పంటల కోసం కూడా వ్యవసాయ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

మార్కెట్లో డిమాండ్ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రతిపాదించిందని, దీనికి రైతుల నుంచి వందకు వంద శాతం మద్దతు లభించిందని కేసీఆర్ అన్నారు.

నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై సీఎం కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

జిల్లాల వారీగా పంటల సాగు పరిస్థితిని సమావేశంలో సీఎం సమీక్షించారు.

ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు వర్షాకాంలో 41,76,778 ఎకరాల్లో వరి పంటను, 12,31,284 ఎకరాల్లో కందులను, 4,68,216 ఎకరాల్లో సోయాబీన్ ను, 60,16,079 ఎకరాల్లో పత్తిని, 1,53,565 ఎకరాల్లో జొన్నలను, 1,88,466 ఎకరాల్లో పెసర్లను, 54,121 ఎకరాల్లో మినుములు, 92,994 ఎకరాల్లో ఆముదాలు, 41,667 ఎకరాల్లో వేరుశనగ (పల్లి), 67,438 ఎకరాల్లో చెరుకు, 54,353 ఎకరాల్లో ఇతర పంటలు పండిస్తున్నట్లు అధికారులు వివరించారు. మొత్తం 1,25,45,061 ఎకరాల్లో రైతులు నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానం అమలు చేయడానికి సిద్ధం కావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

‘‘రాష్ట్రంలో రైతులంతా పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైతులందరికీ వెంటనే రైతుబంధు సాయం అందించాలి. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కుంటున్నప్పటికీ రైతులకు అందించే రైతుబంధు డబ్బులు మాత్రం తప్పక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి ఒక ఎకరానికి పదివేల చొప్పున సాయం అందించాలన్నది ప్రభుత్వ విధానం. వర్షాకాలంలో రూ. 5 వేలు, యాసంగిలో రూ.5 వేలు ఇస్తున్నాం.

ఈ వర్షాకాలంలో అందరు రైతులకు ఎకరానికి ఐదు వేల చొప్పున ఇవ్వడానికి మొత్తం ఏడు వేల కోట్లు కావాలి. ఇప్పటికే రూ.5,500 కోట్లను వ్యవసాయశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. మరో 1500 కోట్ల రూపాయలను కూడా వారం రోజుల్లో జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించాం. తక్షణం రైతులకు రైతుబంధు డబ్బులను బ్యాంకుల్లో జమ చేసే పని ప్రారంభమవుతుంది. పది పన్నెండు రోజుల్లోనే అందరు రైతులకు రైతుబంధు సాయం బ్యాంకుల్లో జమ కావాలి. ఇది రైతులకు అండగా ఉండాలనే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.