Palamuru Rangareddy Project: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఈ నెల 16న నార్లాపూర్‌ ఇన్‌టేక్ నుంచి బాహుబలి పంపు ద్వారా కృష్ణాజలాల విడుదల

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (Palamuru Rangareddy Project) పథకాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) నిర్ణయించారు. ఇందులో భాగంగా నార్లాపూర్ ఇన్‌టేక్ నుంచి ఈ నెల 16న మధ్యాహ్నం బటన్ నొక్కి బాహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను సీఎం ఎత్తిపోయనున్నారు.

Palamuru Rangareddy Project: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఈ నెల 16న నార్లాపూర్‌ ఇన్‌టేక్ నుంచి బాహుబలి పంపు ద్వారా కృష్ణాజలాల విడుదల
KCR (Credits: T News)

Hyderabad, SEP 06: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (Palamuru Rangareddy Project) పథకాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) నిర్ణయించారు. ఇందులో భాగంగా నార్లాపూర్ ఇన్‌టేక్ నుంచి ఈ నెల 16న మధ్యాహ్నం బటన్ నొక్కి బాహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను సీఎం ఎత్తిపోయనున్నారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి దక్షిణ తెలంగాణ ప్రజల తాగునీరు, సాగునీరు అవసరాలను ఎత్తిపోతలు తీర్చనున్నాయని సీఎం తెలిపారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతతో అనేక అడ్డంకులను దాటుకుని మోక్షం లభించడం చారిత్రక సందర్భమని స్పష్టం చేశారు. దశాబ్దాల కల సాకారమవుతున్న చారిత్రక సందర్భంలో దక్షిణ తెలంగాణ రైతాంగానికి ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజని సీఎం స్పష్టం చేశారు. 17న ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి జిల్లాల్లోని పల్లె పల్లెనా ఊరేగింపులతో ఈ విజయాన్ని పెద్ద ఎత్తున సంబురాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రారంభానికి పల్లె పల్లె నుంచి సర్పంచులు సహా తరలివచ్చే ప్రజలు కలషాలు తెచ్చుకుని వాటితో తీసుకెల్లిన కృష్ణా జలాలతో ఆయా గ్రామాల్లో దైవాల పాదాలను అభిషేకించి మొక్కులు చెల్లించుకోవాలని కోరారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు (Palamuru Rangareddy Project) పనుల పురోగతిని సమీక్షించేందుకు సీఎం కేసీఆర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల పనులను సమీక్షించారు. ప్రాజెక్టు పరిధిలో కాల్వల తవ్వకం అందుకు సంబంధించి భూ సేకరణ సహా అనుబంధ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే డ్రై రన్ ట్రయల్స్‌ పూర్తి చేసుకుని.. వెట్‌రన్‌కు సిద్ధంగా ఉందని సమావేశంలో ఇంజినీరింగ్‌ అధికారులకు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఇంజినీర్ల సూచనల మేరకు 16న సీఎం కేసీఆర్‌ వెట్ రన్ ప్రారంభించనున్నారు. కృష్ణా నదికి అనుసంధానించి, (శ్రీశైలం ఫోర్ ప్లో వద్ద) నార్లాపూర్ వద్ద నిర్మించిన ఇన్‌టేక్ వద్దకు చేరుకొని అక్కడ స్విచ్ ఆన్ చేసి పంపులను ప్రారంభిస్తారు. వెట్ రన్ ద్వారా బాహుబలి పంపుల గుండా ఎగిసిపడే కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌కు చేరుకోనున్నాయి.

మోటార్లు ఆన్ చేసిన వెంటనే సీఎం కేసీఆర్ నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని రిజర్వాయర్‌కు ఎత్తిపోతల ద్వారా చేరుకుంటున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణధ్యాయం లిఖించనున్నది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తెలంగాణను సస్యశ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకుంటున్న చారిత్రక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లె నుంచి సర్పంచులు గ్రామస్తులు బహిరంగసభకు హాజరుకావాలన్నారు. ప్రారంభోత్సవం సహా బహిరంగ సభ నిర్వహణ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాల పల్లెలనుంచి ప్రజలను ప్రారంభోత్సవానికి తరలించేందుకు చేపట్టాల్సిన రవాణా ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు ప్రభుత్వమే నిర్వహించాలనే సమావేశం ఏకాభిప్రాయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు.

(The above story first appeared on LatestLY on Sep 06, 2023 11:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).