Hyderabad Traffic Police Issue Key Advisory for Public and Companies

Heavy Rain Alert in Hyderabad: తెలంగాణ వ్యాప్తంగా రాగల 24 నుండి 48 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం అత్యంత కీలకమైన అడ్వైజరీని విడుదల చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కంపెనీలు, బహుళ జాతీయ సంస్థలు, వాణిజ్య వ్యాపార సముదాయాలు తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర చర్యలు తీసుకోవాలని సూచించింది. వీలైతే ఉద్యోగులందరికీ వెంటనే 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) సౌకర్యాన్ని కల్పించాలని, కార్యాలయాల నుంచి విధులు నిర్వహిస్తున్న వారికి మధ్యాహ్నం 2:00 గంటల నుంచే దశలవారీగా లాగౌట్ ఇచ్చి ఇళ్లకు పంపించాలని స్పష్టం చేసింది.

సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ కారిడార్లలో సాయంత్రం ఆఫీస్ వేళల్లో ఒకేసారి వేలాది వాహనాలు రోడ్లపైకి రావడం వల్ల తీవ్ర ట్రాఫిక్ స్తంభన ఏర్పడుతోంది. దీనికితోడు కుండపోత వర్షం కురిస్తే ప్రధాన రహదారులు జలమయమై వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మరియు అత్యవసర సేవలైన అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, జీహెచ్‌ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు సులభంగా ప్రయాణించేందుకు వీలుగా పోలీసులు ఈ దశలవారీ లాగౌట్ విధానాన్ని ప్రతిపాదించారు.

హైదరాబాద్‌ నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

కంపెనీలు తమ ఉద్యోగులను ఒకేసారి కాకుండా మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం వరకు విడతల వారీగా బయటకు పంపడం వల్ల రహదారులపై వాహనాల రద్దీ ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడానికి కంపెనీలు తమ కార్యాలయాల వివరాలతో పాటు, ఉద్యోగుల షిఫ్ట్ వేళలు మరియు లాగౌట్ సమయాలను ప్రత్యేక ఈమెయిల్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని కోరారు.

ఈ నిర్ణయంపై సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సున్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ నిర్వహణ అత్యంత సవాలుతో కూడుకున్నది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ముందస్తు జాగ్రత్తగా సుమారు 1,500 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు మరియు సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాం. వాతావరణ శాఖ ఇచ్చే క్షణక్షణ సమాచారాన్ని, ట్రాఫిక్ హెచ్చరికలను ఐటీ యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాం" అని వెల్లడించారు.

భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో సామాన్య ప్రజలు కూడా అనవసరంగా రోడ్లపైకి రాకూడదని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా నీటితో నిండిన త్రవ్వకాలు, తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు, విద్యుత్ వైర్లు వేలాడుతున్న ప్రాంతాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షపు నీరు నిలిచిపోయిన రహదారులపై వాహనాల వేగాన్ని తగ్గించి, ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే సహాయం కోసం సైబరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ లేదా 'డయల్ 100' ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.