Hyderabad Rains: భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం.. నగరమంతా ట్రాఫిక్ జామ్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
మధ్యాహ్న సమయంలో వర్షం తీవ్రరూపం దాల్చడంతో కార్యాలయాల నుంచి బయలుదేరిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా హైటెక్ సిటీ–గచ్చిబౌలి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
Hyderabad Rains: వాతావరణ శాఖ హెచ్చరికలు నిజమయ్యాయి. హైదరాబాద్లో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమవగా, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, పలు చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది.
ఐటీ కారిడార్ పరిధిలోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గంతో పాటు అమీర్పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మధ్యాహ్న సమయంలో వర్షం తీవ్రరూపం దాల్చడంతో కార్యాలయాల నుంచి బయలుదేరిన ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా హైటెక్ సిటీ–గచ్చిబౌలి మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ముందుగానే ఐటీ కంపెనీలకు అడ్వైజరీ జారీ చేశారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వీలైనంత వరకు **వర్క్ ఫ్రమ్ హోమ్** అమలు చేయాలని, కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులకు **ఎర్లీ లాగౌట్** కల్పించాలని సంస్థలను కోరారు.
మరోవైపు, జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, హైడ్రా (HYDRAA), ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రహదారులపై నిలిచిన నీటిని తొలగించడం, మ్యాన్హోల్స్ను శుభ్రపరచడం, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం వంటి పనులను వేగవంతం చేశారు.
నగరంలో మరో కొంతసేపు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, నీటితో నిండిన రహదారులు, తెగిపడిన విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలు, పొంగిపొర్లుతున్న మ్యాన్హోల్స్ సమీపంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.