Hyderabad Murder Case: భార్యను దారుణంగా చంపిన కేసులో ఆ ఒక్క క్లూతో దొరికిపోయిన మాజీ ఆర్మీ జవాను గురుమూర్తి, ఎంత భయానకంగా చంపాడో మీడియాకి తెలిపిన పోలీసులు
ఆమెను పథకం ప్రకారం హత్య (Hyderabad Murder Case) చేసి, మృతదేహాన్ని మాయం చేసేందుకు ముక్కలు చేశాడని, వాటిని వేడి నీటిలో ఉడికించి, తర్వాత పొడిగా మార్చి చెరువులో విసిరేసినట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.
Hyd, Jan 29: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మీర్పేట మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. భార్యను దారుణంగా హతమార్చిన నిందితుడైన భర్త గురుమూర్తిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఆమెను పథకం ప్రకారం హత్య (Hyderabad Murder Case) చేసి, మృతదేహాన్ని మాయం చేసేందుకు ముక్కలు చేశాడని, వాటిని వేడి నీటిలో ఉడికించి, తర్వాత పొడిగా మార్చి చెరువులో విసిరేసినట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్కుమార్, ఇతర అధికారులతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు మంగళవారం ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి చెందిన పుట్ట గురుమూర్తి, వెంకట మాధవిలకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో జవానుగా 9Ex-Serviceman Gurumurthy Who Killed Wife) పనిచేశాడు. ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఎల్లో కాంట్రాక్టు భద్రతా ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లెలగూడలోని వెంకటేశ్వర కాలనీలో వీరి కుటుంబం నివాసముంటోంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే భార్యపై అనుమానంతో పాటు కక్ష పెంచుకున్న గురుమూర్తి.. ఎలాగైనా అంతమొందించాలని భావించాడు. ఇందులో భాగంగా భోగి పండుగ నాడు(13న) భార్య, ఇద్దరు పిల్లల్ని బడంగ్పేట్లోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లల్ని అక్కడే వదిలేసి.. భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. 15న మరోసారి భార్యతో కలిసి సోదరి ఇంటికి వెళ్లి.. రాత్రి 10.30 గంటలకు ఇంటికి తిరిగొచ్చారు. ఇంట్లో పిల్లలు లేకపోవడం, అపార్టుమెంటులోని ఇరుగుపొరుగు వారు పండగ నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లడంతో ఆమెను హత్య చేసేందుకు ఇదే అదనుగా భావించాడు.
16వ తేదీన ఉదయం భార్యతో గొడవపడి ఆమె తలను గోడకు బలంగా కొట్టాడు. అంతటితో ఆగటక గొంతు పిసికి చంపేశాడు. మృతదేహాన్ని పక్కన పెట్టుకుని దాన్ని మాయం చేయడం గురించి ఆన్లైన్లో రెండు గంటలు పాటు వెతికాడు. మృతదేహాన్ని ఇంట్లోని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి.. కత్తితో రెండు చేతులు, కాళ్లు కోసేశాడు. తర్వాత చిన్న ముక్కలుగా చేసి.. నీటి బకెట్లో వేసి హీటర్తో ఆ ముక్కలని ఉడికించాడు. ఆపై స్టవ్పై వాటిని కాల్చి అనంతరం రోకలితో దంచి పొడిగా మార్చాడు. ఎముకల పొడి, మాంసం ముక్కల్ని ఇంట్లోని మరుగుదొడ్డిలో దఫదఫాలుగా వేసి నీళ్లు వదిలాడు. మిగిలిపోయిన ఎముకల పొడి, ఇతర భాగాలను సాయంత్రం సమీపంలోని జిల్లెలగూడ పెద్ద చెరువులో విసిరేశాడు. మరుగుదొడ్డిలో ఆనవాళ్లు కనబడకుండా ఫినాయిల్, సర్ఫ్తో శుభ్రం చేశాడు. అనంతరం సోదరి ఇంటికి వెళ్లి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాడు.
ఇక 17న సాయంత్రం తన భార్య కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పాడు. చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నాడు. 18న వారితోనే మీర్పేట పోలీసులకు ఏమీ తెలియనట్లుగా ఫిర్యాదు చేయించాడు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా మాధవి ఇంట్లోకి వెళ్లినవి తప్ప బయటకు వచ్చిన దృశ్యాలు లేవు. దీంతో గురుమూర్తి మీద పోలీసులకు అనుమానం కలిగింది.
తొలుత గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పాడు. తానే హత్య చేసినట్లు పోలీసులకు ఈ నెల 21న చెప్పినా.. ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు సవాలుగా మారింది. 22, 23 తేదీల్లో నిందితుడి నివాసంలో క్లూస్ టీం, ఫోరెన్సిక్ బృందాలు కీలక ఆధారాలు సేకరించాయి. మృతదేహం ముక్కలను బకెట్లో వేసి ఉడికించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. భార్యను దారుణంగా హత్య చేసినా నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. కస్టడీకి తీసుకుని మరోసారి నిందితుడిని విచారిస్తామన్నారు.
(The above story first appeared on LatestLY on Jan 29, 2025 12:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

