Corona in Khammam: ముత్యాలగూడెంలో కొంపముంచిన పెళ్లి వేడుక, హాజరైన వంద మందికి కరోనా, నలుగురు మృతి, మరో జిల్లా నల్లగొండలో ధోవతి ఫంక్షన్లో పది మందికి సోకిన కరోనా
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముత్యాలగూడెం గ్రామంలో జరిగిన పెళ్లి వేడుక కొంపలు ముంచింది. ఆ పెళ్లిలో కరోనా కలకలం రేపింది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. దాదాపు వంద మందిలో కరోనా లక్షణాలు (Khammam Wedding party turns COVID-19 cluster) బయటపడ్డాయి.
Khammam, May 29: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముత్యాలగూడెం గ్రామంలో జరిగిన పెళ్లి వేడుక కొంపలు ముంచింది. ఆ పెళ్లిలో కరోనా కలకలం రేపింది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. దాదాపు వంద మందిలో కరోనా లక్షణాలు (Khammam Wedding party turns COVID-19 cluster) బయటపడ్డాయి.
ఆ గ్రామంలో కేవలం 250 జనాభా ఉండగా వందమంది కరోనా బారీన పడ్డారు. విషాద ఘటన వివరాల్లోకెళితే.. ఈ నెల 26వ తేదీన ఈసం భద్రయ్య, కోరం ఎల్లయ్యలు కరోనాతో చనిపోయారు. అంతకుముందు కోరం రాయుడు అనే వ్యక్తి సైతం కరోనాతో మృత్యువాత పడ్డారు.కాగా ఈ నెల 6, 14వ తేదీల్లో గ్రామంలో (Muthyalagudem) జరిగిన వివాహ వేడుకలే..గ్రామంలో కరోనా వ్యాప్తికి కారణమని, ఎక్కువ సంఖ్యలో జనం హాజరై విందు భోజనాలు చేశారని, మాస్కులు లేకుండా కలివిడిగా తిరిగారని స్థానికులు కొందరు వాపోతున్నారు.
10 రోజుల వ్యవధిలోనే గ్రామంలో 100 కరోనా కేసులు నమోదు కావడం, నలుగురు చనిపోవడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం కూడా ఉలిక్కిపడింది. యుద్ధప్రాతిపదికన దగ్గరలో ఉన్న గాంధీనగర్లోని ఓ ఆశ్రమ పాఠశాలలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి కొందరిని చేర్చారు. పాజిటివ్ వచ్చిన వారి అందరి నుంచి తాజాగా శాంపిల్స్ సేకరించారు. పరీక్షల నిమిత్తం పంపుతున్నారు. ఒకవేళ వేరియంట్స్ ఏమైనా మారాయా..? వైరస్ ఏమైనా కొత్తగా మరోసారి మ్యుటేట్ అయిందా అన్న దానిపై లోతుగా అధ్యయనం చేసే నిమిత్తం శాంపిళ్లను తీసినట్టు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే కొడుకు పెళ్లి చేసిన ఈసం భద్రయ్య కరోనా సోకి చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తహసీల్దార్ డి.పుల్లయ్య, కారేపల్లి ఎస్ఐ పి.సురేశ్, వైద్య సిబ్బంది, కరోనా బాధితుల కుటుంబాలకు మందులు అందజేశారు. కరోనా బాధితుల్లో మరికొందరిని గాంధీనగర్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
ఇక నల్లగొండ జిల్లాలో (Nalgonda) మరో శుభకార్యం ఓ కుటుంబాన్ని కుదిపేసింది. జిల్లాలోని కనగల్ మండలం బచ్చన్నగూడేనికి చెందిన జానయ్య, లక్ష్మి దంపతులు ఇటీవల తమ కుమారుడు సాయికి ధోవతి ఫంక్షన్ నిర్వహించారు. శుభకార్యానికి నల్లగొండ మండలం చెన్నుగూడేనికి చెందిన లక్ష్మి తల్లిదండ్రులు మర్రి జంగయ్య, అలివేలు దంపతులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కాగా, ఫంక్షన్ ముగిసిన రెండు రోజులకు తొలుత జానయ్య, లక్ష్మి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
ఆ తర్వాత జంగయ్య, అలివేలుతో పాటు వీరి చిన్న కుమార్తె, పెద్దకుమారుడు సైదులు, అతడి భార్య, బంధువులు మొత్తంగా పదిమంది వైరస్ బారిన పడ్డారు. జానయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన తొమ్మిది మంది హోంక్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
(The above story first appeared on LatestLY on May 29, 2021 09:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

