Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్, గతంలో ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన వారి ఇండ్లలో సోదాలు, రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ కీలక సమాచారం సేకరణ
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు అరెస్టు కావడం కలకలం రేపుతోంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు (Bhujanga Rao), హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్న (Tirupathanna)ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Hyderabad, March 24: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్రావు ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు అరెస్టు కావడం కలకలం రేపుతోంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు (Bhujanga Rao), హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్న (Tirupathanna)ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రే వీరి ఇళ్లకు వెళ్లిన పోలీసులు.. సోదాలు నిర్వహించారు. శనివారం ఉదయం వీరిద్దరినీ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు పిలిచి సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి సమయంలో అరెస్టు చేశారు. విచ్చలవిడిగా ఫోన్ట్యాపింగ్లకు (illegal snooping) పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది.
భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు (Prabhakar Rao), హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు, ఐన్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్రావు అరువెల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. విచారణకు రావాలని గతంలో ఎస్ఐబీలో పనిచేసిన తొమ్మిది మందికి నోటీసులిచ్చారు. ఐన్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్రావు నైజీరియాకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
శ్రవణ్రావు సూచించిన ఫోన్ నంబర్లనే ప్రణీత్రావు ట్యాపింగ్ చేసినట్లు తేలడంతో అతడింట్లో జరిపిన సోదాల్లో కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చెన్నైలో ఓ పవర్ కంపెనీ పత్రాలు శ్రవణ్ ఇంట్లో గుర్తించారు. రాంపల్లిలోని ఓ స్కూల్ దస్తావేజులు లభ్యమయ్యాయి. రెండు ల్యాప్టాప్లు, నాలుగు ట్యాబ్లు, అయిదు పెన్డ్రైవ్లు, ఒక హార్డ్డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్రావు ఫోన్ట్యాపింగ్ సొంత నిర్ణయంతో జరిగింది కాదని.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు ఇందుకు పురిగొల్పినట్లు దర్యాప్తు బృందం భావిస్తోంది. ఇదే అదనుగా ప్రణీత్ బృందం సొంత నిర్ణయాలు తీసుకొని పలువురు వ్యాపారుల ఫోన్లపై నిఘా ఉంచి లబ్ధి పొంది ఉంటుందని అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ప్రణీత్రావు వాంగ్మూలాల ఆధారంగా నిజానిజాలను నిగ్గు తేల్చడంపై దృష్టి సారించింది.
(The above story first appeared on LatestLY on Mar 24, 2024 10:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

