Rythu Bandhu Scheme: ఇప్పటి వరకు రైతుబంధు రాని వారికి గుడ్ న్యూస్, ఆ రైతులంతా పెట్టుబడి సాయానికి అర్హులేనని తెలిపిన కేసీఆర్ సర్కారు, ఈ నెల 26 నుంచి రైతుబంధు పంపిణీ
రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పూర్తయి, పాస్బుక్ పొందినవారు ఈ సీజన్లో రైతుబంధుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది
Hyd, June 22: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద కొత్త రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 16 నాటికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పూర్తయి, పాస్బుక్ పొందినవారు ఈ సీజన్లో రైతుబంధుకు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో జిల్లాల్లో అర్హులైన రైతుల నుంచి ఏఈవోలు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. కొత్త రైతులే కాకుండా భూమి ఉన్నప్పటికీ గతంలో ఎన్నడూ రైతుబంధు సాయం పొందని రైతులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పథకం కింద సాయం పొందడానికి కొత్త పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది.
ఈ వానకాలం సీజన్కు సంబంధించి ఈ నెల 26 నుంచి రైతుబందు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో తదనుగుణంగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే రైతుబంధు అర్హులకు సంబంధించిన వివరాలను సీసీఎల్ఏ నుంచి స్వీకరించినట్టు తెలిసింది. ఇక ఈసారి కొత్త రైతులు సుమారు లక్ష మంది వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
గత సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 65 లక్షల మందికి రైతుబంధు పంపిణీ చేసింది. ఈ సీజన్లో కొత్త రైతులతోపాటు పోడు రైతులకు కూడా రైతుబంధు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ నెల 24 నుంచి పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. 1.50 లక్షల మంది పోడు రైతులకు 4 లక్షల ఎకరాల పట్టాలకు సంబంధించిన పట్టాలను అందజేయనున్నారు.
బుధవారం నుంచే ఏఈవోలకు రైతుబంధు పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. సీసీఎల్ఏ డేటా ఆధారంగా రైతులను గుర్తిస్తారు. రైతు పట్టాదారు పాస్బుక్ వివరాలను రైతుబంధు పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. రాష్ట్రంలో సీసీఎల్ఏలో నమోదైన పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన 68.94 లక్షలకు పైగా రైతులు రైతుబంధుకు అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కొత్త లబ్ధిదారుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఈనెల 26 నుంచే రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
భూమి పాస్బుక్ జిరాక్స్ లేదా ఎమ్మార్వోతో డిజిటల్ సంతకం అయిన డీఎస్ పేపర్
రైతు ఆధార్కార్డు జిరాక్స్
బ్యాంకు పాస్బుక్ జిరాక్స్
(The above story first appeared on LatestLY on Jun 22, 2023 10:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

