Dog Attack Boy Case: వీధి కుక్కల దాడిపై కేసీఆర్ ప్రభుత్వం సీరియస్, నియంత్రణకు గైడ్ లైన్స్ జారీ, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని మండిపడిన హైకోర్టు
అంబర్పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి కేసుపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
Hyd, Feb 23: అంబర్పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి కేసుపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించిన సంగతి విదితమే. ఈ సందర్భంగా బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ ఏం చేస్తోందని ప్రశ్నించింది. నష్టపరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపిన కోర్టు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది.
విచారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించిన ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టగా.. పిటిషన్లో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ, తదితరులను ప్రతివాదులుగా చేర్చింది.
ఇదిలా ఉంటే వీధికుక్కల దాడిని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సీరియస్గా తీసుకుంది. వీధి కుక్కల దాడులు, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం గైడ్ లైన్స్ (Guide lines) జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలకు ఆదేశించింది. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా నియంత్రించాలని... కుక్కలకు 100 శాతం స్టెరిలైజేషన్ (Sterilization) చేయాలని పేర్కొంది.
మాంసం దుకాణాలు, ఫంక్షన్ హాళ్ల వారు మాంసాహారాన్ని ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కుక్కలను పట్టుకునే బృందాలు, వాహనాల సంఖ్యను పెంచాలని తెలిపింది. వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించాలని... అలాగే వీధి కుక్కలపై స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించాలని పేర్కొంది.
ఈ మేరకు కరపత్రాలను పంపిణీ చేయాలని చెబుతూ.. జీహెచ్ఎంసీ, సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ గోల్నాక సెక్టార్ ఎస్సై విజయ్కు ఇన్చార్జి సీఐ ప్రభాకర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. వీధి కుక్కలు, కోతుల బెడద నివారణ చర్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) సమీక్ష సమావేశం నిర్వహించారు. మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో సమావేశమయ్యారు.
అసలేం జరిగింది
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్.. నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వచ్చి అంబర్పేటలో నివాసముంటున్నారు. అంబర్పేటలోని ఓ కారు సర్వీసింగ్ సెంటర్లో వాచ్మన్గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. గత ఆదివారం గంగాధర్ తన ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్తో కలసి తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్కు వెళ్లారు. కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపల ఉంచి తాను పనిచేసుకుంటున్నారు.
ప్రదీప్ ఆడుకుంటూ అక్క కోసం కేబిన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో చిన్నారి తల, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన బాలుడి తండ్రి అక్కడికి వచ్చే లోపే చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
(The above story first appeared on LatestLY on Feb 23, 2023 06:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

