MLC K Kavitha: దేశానికి ప్రధాని మోదీనా, లేక ఆదానీనా, కార్మిక ధర్మయుద్ధం సభలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం చేస్తామని వెల్లడి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ, కార్మిక హక్కులను, సంక్షేమాన్ని కాలరాస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Telangana MLC K Kavitha) ఆగ్రహం వ్యక్తంచేశారు.
Warangal, June 1: ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు ‘కార్మిక చైతన్య మాసోత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా హనుమకొండ జిల్లా కాజీపేటలో మంగళవారం ఏర్పాటుచేసిన ‘కార్మిక ధర్మయుద్ధం’ సభలో ఎమ్మెల్సీ కవిత (MLC K Kavitha) ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. పేదలు ఎక్కువగా ఉన్న దేశంలో వారిని దోపిడీ నుంచి రక్షించేందుకు ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ, కార్మిక హక్కులను, సంక్షేమాన్ని కాలరాస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Telangana MLC K Kavitha) ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికులతో రోజుకు 12 గంటలు పనిచేయించేలా చట్టాలు మారుస్తున్నదని మండిపడ్డారు. కార్మికుల చెమట చుక్కలకు విలువ కట్టని ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమం(Implementing ‘Anti-Labourer Laws’ ) కొనసాగించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రధాని మోదీ యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ దేశంలో ఉంటే ఎలక్షన్ మోడ్లో లేకుంటే ఎరోప్లేన్ మోడ్లో ఉంటారని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ ప్రభుత్వరంగ సంస్థలను తన స్నేహితుడు అదానీకి కట్టబెడుతున్నారని, అసలు దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారా? అదానీ ఉన్నారా? అనే అనుమానం కలుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేస్తూ, సమస్త రంగాల కార్మికులకు రక్షణగా నిలుస్తున్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని కాపాడుతున్నదని, ఆటో రిక్షాలకు పన్ను మినహాయించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ పోరాటం చేస్తున్నదని చెప్పారు. కేంద్రం కార్మికుల హక్కులను కాలరాస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామీణ ఉపాధిహామీ తరహాలోనే పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లోనూ ఉండాలనే సంకల్పంతో కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని, తెలంగాణ తరహా పథకాలు కావాలని దేశ ప్రజలు కోరుకొంటున్నారని వివరించారు. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత ఒక మాట చెప్తున్నదని దుయ్యబట్టారు. కార్మికుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ మంచి కార్యక్రమాన్ని చేపట్టారని, మిగిలిన ఎమ్మెల్యేలు ఇలాంటి వాటిని చేపడితే బాగుంటుందని అన్నారు.
(The above story first appeared on LatestLY on Jun 01, 2022 01:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

