Telangana: ఎమ్మెల్యేల కొనుగోలుకు రూ. 100 కోట్ల డీల్ కేసు అప్డేట్స్ , విచారణను వేగవంతం చేసిన పోలీసులు, టీఆర్ఎస్ ఒక డ్రామా కంపెనీ అంటూ బీజేపీ విమర్శలు, ధర్నాకు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు తెలంగాణలో (Telangana) కలకలం సృష్టిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు (buying TRS MLAs) బేరసారాలు జరిగిన వ్యవహారంపై విచారణను పోలీసుల వేగవంతం చేశారు.మొయినాబాద్ సమీపంలోని ఫాంహౌస్లో పట్టుబడిన ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు.
Hyd, Oct 27: ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు తెలంగాణలో (Telangana) కలకలం సృష్టిస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు (buying TRS MLAs) బేరసారాలు జరిగిన వ్యవహారంపై విచారణను పోలీసుల వేగవంతం చేశారు.మొయినాబాద్ సమీపంలోని ఫాంహౌస్లో పట్టుబడిన ముగ్గురు నిందితులను ప్రశ్నిస్తున్నారు. వారిని పోలీసు అధికారులు రహస్య ప్రాంతాల్లో ఉంచి విచారిస్తున్నారు.బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై కూపీ లాగుతున్నట్లు సమాచారం. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని విశ్లేషిస్తున్నారు.
వారి నుంచి వివరాలు సేకరించిన తర్వాత ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రలోభాలకు గురిచేయడం, బేరసారాలకు పాల్పడటంపై మొయినాబాద్ పీఎస్లో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ఇక బేరాలు జరిగిన ఫామ్హౌజ్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి చెందినదేనని తెలుస్తోంది. మెయినాబాద్ మండలం అజీజ్నగర్లోని ఈ ఫామ్హౌస్పై పోలీసులు దాడి చేసినప్పుడు రోహిత్రెడ్డి మీడియాతో మాట్లాడకుండా లోపలే ఉండిపోయారు.
సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఆయనను రహస్యంగా విచారించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ముగ్గురు ఎమ్యెల్యేలు గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, హర్షవర్ధన్రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఇక పోలీసు బందోబస్తు నడుమ రోహిత్రెడ్డి కూడా రాత్రి 11 గంటలకు ప్రగతిభవన్కు చేరుకున్నారు. వీరితో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, ఆర్థిక మంత్రి హరీశ్రావుతో పాటు మరికొందరు పార్టీ ముఖ్య నేతలు కూడా బుధవారం రాత్రి ప్రగతిభవన్కు వచ్చారు.
Here's Deal Video
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ స్కెచ్.. పోలీసులకు దొరికిపోయిన బీజేపీ నేతలు.. కోట్లలో డబ్బు స్వాధీనం @trspartyonline @KTRTRS @BJP4Telangana pic.twitter.com/YB8nX7ZPe3
— kaatam vidyasagar (@kaatamvidyasag1) October 27, 2022
నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలందరితోనూ సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బుధవారం అర్ధరాత్రి వరకూ ఈ భేటీ కొనసాగింది. తమతో బీజేపీ దూతలు సంప్రదింపులు జరిపిన తీరు, ప్రలోభాలకు గురిచేసిన వైనాన్ని నలుగురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్కు పూసగుచ్చినట్లు వివరించినట్లు తెలిసింది. దీనిపై గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు.
రోహిత్రెడ్డి 2017లో పోలీస్ అకాడమీ జంక్షన్ నుంచి మొయినాబాద్ వెళ్లే మార్గంలో అజీజ్నగర్ రెవెన్యూ పరిధిలో ఐదెకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో మామిడి చెట్లు నాటారు. మధ్యలో విశాలమైన ఫామ్హౌజ్ను నిర్మించారు. ఔటర్ రింగ్రోడ్డుకు ఒకట్రెండు కిలోమీట ర్ల దూరంలోనే ఈ ఫామ్హౌజ్ ఉంటుంది. రోహిత్రెడ్డి తరచూ ఇక్కడికి వస్తూపోతూ ఉంటారని.. సమీపంలో జనం పెద్దగా ఉండరని పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఇంట్లో పూజల కోసమే తాము వచ్చామని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన నందకుమార్ చెప్పారు. హైదరాబాద్లోని సరూర్నగర్ చైతన్యపురికి చెందిన ఆయన ఘటన అనంతరం వివరాలు వెల్లడించారు. తనతో పాటు ఢిల్లీలోని ఫరీదాబాద్లో ఉన్న ఆలయ పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీశ్శర్మ, తిరుపతిలోని శ్రీమనాథరాజపీఠం పీఠాధిపతి డి.సింహయాజులు వచ్చారని తెలిపారు.
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీకి చెందిన సతీశ్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి(ఏ1), హైదరాబాద్కు చెందిన నందకిశోర్(ఏ2), తిరుపతికి చెందిన సింహయాజి (ఏ3)పై కేసు నమోదు కేసినట్లు రాజేంద్రనగర్ ఏసీపీ తెలిపారు. ఈ కేసు ఎఫ్ఐఆర్లో కీలక అంశాలను పోలీసులు పొందుపర్చారు.
బీజేపీలో చేరితే రూ.100కోట్లు ఇప్పిస్తామని రోహిత్రెడ్డికి సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతీ ఆఫర్ చేశారని.. నందకిశోర్ (నందు) మధ్యవర్తిత్వంతో ఫామ్హౌస్కు సతీష్ శర్మ, సింహయాజి వచ్చారని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ.100కోట్లు ఇస్తామని బీజేపీ తరఫున వారు హామీ ఇచ్చినట్లు పైలట్ రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.
ఆ పార్టీలో చేరకపోతే ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లుగా ఆయన పేర్కొన్నట్లు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. బీజేపీలో చేరితే సెంట్రల్ సివిల్ కాంట్రాక్టులతోపాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారంటూ రోహిత్ రెడ్డి చెప్పిన విషయాన్ని పోలీసులు పేర్కొన్నారు. తనకు రూ.100కోట్లు, తనతో ఆ పార్టీలో చేరే వారికి రూ.50కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లు రోహిత్ రెడ్డి తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై టీఆర్ఎస్ శ్రేణులు మెరుపు ధర్నా చేపట్టాయి. విజయవాడ హైవేపై చౌటుప్పల్ వద్ద మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, ఇతర తెరాస నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి ఇతర టీఆరెఎస్ నేతలు రహదారిపై బైఠాయించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర చేసిందంటూ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
Here;s Strike Videos
టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేయడాన్ని నిరసిస్తూ చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండల కేంద్రంలో రాస్తారోకో చేసి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసిన నాయకులు.#TelanganaNotForSale pic.twitter.com/i6vVW6mcAw
— Balka Suman (@balkasumantrs) October 27, 2022
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు నిరసనగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేంద్ర బిజెపి పార్టీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది.@KTR_News @KTRTRS @trspartyonline @trsinnews @chmallareddyMLA @TelanganaCMO pic.twitter.com/rt3pVEsTFF
— Jakka Venkat Reddy (@VenkatReddyJkka) October 27, 2022
బీజేపీ పార్టీ స్పందన ఇదే..
టీఆర్ఎస్ ఒక డ్రామా కంపెనీ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆ పార్టీ కట్టు కథలు చూస్తే ప్రజలంతా నవ్వుకుంటారని విమర్శించారు. ఫామ్హౌజ్లో ఉన్నవాళ్లు బీజేపీ వాళ్లని ఎవరు చెప్పారు? ఫామ్హజ్ వాళ్లదే, ఫిర్యాదు చేసింది వాళ్లే. ఒక మంత్రిపై హత్యాయత్నం జరిగిందని గతంలోనూ డ్రామా ఆడారు. బేరసారాలకు ఎక్కడైనా స్వామీజీలు వెళ్తారా? హిందూ ధర్మం అంటే కేసీఆర్కు ఎందుకంత కోపం?ఈ ఘటనపై మూడురోజులుగా ఎమ్మెల్యేలు సమావేశమై కుట్ర చేశారు.
నలుగురు ఎమ్మెల్యేలను పీఎస్కు ఎందుకు తరలించలేదు? వారు నేరుగా ప్రగతిభవన్కు ఎలా వెళ్తారు? ఆ నలుగురు ఎమ్మెల్యేలను అర్ధరూపాయికి కూడా ఎవరూ కొనరు. తన పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించేందుకే ఈ నాటకమాడారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూసుకునేందుకే ఈ నాటకం. కేసీఆర్ నాటకమంతా త్వరలోనే బయటపడుతుంది. ఈ నాటకమంతా త్వరలోనే కేసీఆర్ మెడకే చుట్టుకుంటుంది. హిందూ సమాజాన్ని కించపరిచేందుకు కేసీఆర్ కుట్రపన్నారు. హిందూ సమాజాన్ని కించపరిచేందుకే స్వామిజీని ఇరికించారు. టీఆర్ఎస్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయిస్తాం. ఫామ్హౌజ్ అడ్డగా గుట్కా వ్యాపారం నడుస్తోంది’’ అని బండి సంజయ్ విమర్శించారు.
ఫామ్హౌజ్ ఘటనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు తిప్పికొట్టారు. ‘‘రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్ అయినట్టు.. ఈ కథ చూస్తే అలా అనిపిస్తోంది. కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్, హీరో, విలన్.. అంతా వాళ్లే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి నాయకుడి ఫామ్హౌస్, డబ్బులు, యంత్రాంగం, పోలీసులు అంతా వారే. కేవలం మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతున్నామనే ఇదంతా చేస్తున్నారు. దేశంలో ఎన్నో ఉప ఎన్నికలు జరిగాయి... ఎక్కడైనా ఒక్క నియోజకవర్గంలో 83 మంది ఎమ్మెల్యేలు మోహరించారా?మంత్రులు, ఎమ్మెల్సీలు నెల రోజుల నుంచి అక్కడే మకాం వేశారు.
ఎన్ని చేసినా అక్కడ గెలిచే అవకాశం లేదని చెప్పి.. ఈ విధంగా కథలు సృష్టిస్తున్నారు. ఈ నాలుగైదు రోజుల్లో ఇంకా ఎన్ని కథలు సృష్టిస్తారో చూడాలి. గతంలో కూడా మంచి స్టోరీ చూశాం. మంత్రి శ్రీనివాస్గౌడ్ను హత్య చేసేందుకు రూ.కోట్లు సుపారీ ఇచ్చారని కథ అల్లారు. ఆ కథ కంచికేనా? దానికి కారకులైన వారు టీఆర్ఎస్ ప్లీనరీలో సెల్ఫీ దిగిన ఉదంతాలు చూశాం. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. మునుగోడులో ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వం పడిపోయేది లేదు. ఎందుకింత ఆక్రోశం. ఇలాంటి కట్టు కథల ద్వారా ప్రజల దృష్టి మరల్చలేరు’’ అని లక్ష్మణ్ అన్నారు.
(The above story first appeared on LatestLY on Oct 27, 2022 12:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

