Bhadrachalam Adhyayanotsavalu: భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు, దశావతారాల్లో దర్శనమివ్వనున్న శ్రీరామచంద్రులు, డిసెంబర్ 15 నుంచి జనవరి 4 వరకు ఉత్సవాలు
Sri Sita Ramula Kalyanam at Bhadrachalam. | Official Photo

Bhadrachalam, Dec 9: ఉత్సవాలకు శ్రీరామ చంద్రులు రెడీ అయ్యారు. ఈ నెల 15వ తేదీ నుంచి భద్రాది శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు (Vaikunta Ekadasi Prayukta Adyayanotsavamlu in Bhadrachalam) ప్రారంభం కానున్నాయి. 16న ధనుర్మాస ఉత్సవాలు (Bhadrachalam Adyayanotsavamlu) మొదలుకానున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామి వారు దశావతారాల్లో దర్శనమివ్వనున్నారు. 15న మత్స్యవతారం, 16న కూర్మావతారం, 17న వరహావతారం, 18న నరసింహావతారం, 19న వామనవతారం, 20న పరశురామవతారం, 21న రామావతారం, 22న బలరామావతారం, 23న కృష్ణావతారంలో సీతారామచంద్రస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ సందర్భంగా అవతారాల సమయంలో ప్రతి రోజు స్వామి వారిని అందంగా అలంకరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మేళతాళాల మధ్య అధ్యయనోత్సవ వేదికపై ఆసీనులు చేయనుండగా.. భక్తులు స్వామివారలను దర్శించుకోనున్నారు. అనంతరం సాయంత్రం తిరువీధి సేవ నిర్వహించనున్నారు. 24న శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. 25న ఉదయం 5గంటలకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వార దర్శనం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే డిసెంబరు 25 నుంచి జనవరి 4 వరకు రాపత్తు ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.

భ‌ద్రాద్రిలో రాములోరి కళ్యాణోత్సవం. నిరాడంబరంలోనే రమణీయంగా, కమనీయంగా సాగిన వేడుక, తొలిసారిగా భక్తులు లేకుండానే జరిగిన బ్రహ్మోత్సవం

ఉత్సవాల్లో భాగంగా స్వామి వారు భద్రాచలం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మండపాల్లో రోజుకో మండపంలో స్వామి వారు ప్రత్యేక పూజలను అందుకోనున్నారు. తొలి రాపత్తు సేవ డిసెంబరు 25న పట్టణంలోని డీఎస్పీ బంగ్లాలో ప్రారంభమై జనవరి 4న దసరా మండపంలో రాపత్తు సేవతో ముగస్తుంది. జనవరి 5 నుంచి 7 వరకు విలాసోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా శ్రీరామదాసు మండపం, నృసింహదాస మండపం, వశిష్ట మండపాల్లో విలాసోత్సవాల్లో భాగంగా స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా జనవరి 10న భద్రాద్రి క్షేత్రానికే ప్రత్యేకమైన సర్వదేవతా అలంకారమైన ‘విశ్వరూప సేవ’ నిర్వహించనున్నారు.