JIo Wireless Data: జియో మరో సంచలన నిర్ణయం, వైర్ లెస్ డేటా ఛార్జీల బాదుడుకు రెడీ, రూ.15 నుంచి రూ.20కి పెంచాలని ట్రాయ్‌కి లేఖ రాసిన రిలయన్స్ జియో
Mukesh Ambani (Photo-Twitter)

Mumbai, Mar 07: దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) తన యూజర్లకు మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్రీ కాల్స్ ఎత్తేసి కాల్ ఛార్జీలు విపరీతంగా పెంచిన జియో.. ఇప్పుడు వైర్ లెస్ డేటా (JIo Wireless Data) టారిఫ్‌లను పెంచాలని జియో (Jio) నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 15గా ఉన్న 1 జీబీ డేటా ధరను రూ. 20కి పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్‌కు జియో లేఖ రాసింది.

ఒక్కసారి రీఛార్జ్ చేయండి, 336 రోజుల పాటు అపరిమిత ప్రయోజనాలు పొందండి

ప్రతిపాదిత డేటా ధరలను తక్షణమే కాకుండా 6 నెలల నుంచి 9 నెలల వ్యవధిలో అమలు చేయాలని భావిస్తున్నట్టు ట్రాయ్‌కు (TRAI) తెలిపింది. పెరగనున్న డేటా చార్జీలు అన్ని టారిఫ్‌లకు వర్తిస్తాయంది. వాయిస్ కాల్స్ ధరల విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయడం లేదని, ప్రస్తుతం ఉన్న వాటినే యథావిధిగా కొనసాగించనున్నట్టు జియో వెల్లడించింది. వినియోగదారుల్లో పెరుగుతున్న డేటా వినియోగానికి అనుగుణంగా ఫ్లోర్ ప్రైసింగ్ ను పెంచాలని ట్రాయ్ కి రాసిన లేఖలో రిలయన్స్ జియో అడిగింది.

జియో డిజిటల్ పేమెంట్ యాప్ వచ్చేసింది

ఇదిలా ఉంటే టెలికాం రంగం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కారణంగా ఫ్లోర్ ప్రైసింగ్ ను నిర్ణయించాలని ట్రాయ్ ఎప్పటినుంచో టెలికం కంపెనీలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్, వొడాఫోన్ సంస్థలు ఇప్పటికే భారీ ఏజీఆర్ బకాయిలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో 1 జీబీ కనీస ధరను మెల్లగా రూ.15కు అక్కడ నుంచి రూ.20కు తీసుకెళ్లాలని రిలయన్స్ జియో ట్రాయ్ కు లేఖ రాసింది.

టెల్కో దిగ్గజాలు భారీగా ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉన్నందున టెలికాం పరిశ్రమ భారీ ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది. వొడాఫోన్ ఐడియా రూ.53 వేల కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ రూ.35వేల కోట్ల ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉంది. రిలయన్స్ జియో ఒక టార్గెట్ ఫ్లోర్ ధరను నిర్ణయించిన తర్వాత, ఇది టెలికాం పరిశ్రమలో కీలకమైన అంశంగా ఉండి, దెబ్బ తిన్న కంపెనీలకు సాయం చేస్తుందని జియో పేర్కొంది. అలాగే స్థిరమైన ఫ్లోర్ ప్రైస్ టెల్కో దిగ్గజాల ఆర్థిక భారాన్ని నెమ్మదిగా తొలగిస్తుందని తెలిపింది.