EPFO Wage Ceiling Hiked: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPFO వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. 51 లక్షల మందికి ప్రయోజనం..
దేశంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద తప్పనిసరి కవరేజీకి వర్తించే వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
EPFO Wage Ceiling Hiked: దేశంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద తప్పనిసరి కవరేజీకి వర్తించే వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు బుధవారం కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో 51 లక్షలకు పైగా అదనపు ఉద్యోగులు తప్పనిసరి EPFO పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం నెలకు రూ.15,000 కంటే ఎక్కువ వేతనంతో కొత్తగా ఉద్యోగంలో చేరే వారు కొన్ని నిబంధనలకు లోబడి ఆటోమేటిక్గా EPFO తప్పనిసరి కవరేజీలోకి రావడం లేదు. దీంతో అలాంటి ఉద్యోగులు తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, సంబంధిత బీమా ప్రయోజనాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు వేతన పరిమితిని రూ.25,000కు పెంచడంతో రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య వేతనం పొందే ఉద్యోగుల్లో మరింత మంది చట్టబద్ధమైన సామాజిక భద్రతా వ్యవస్థ పరిధిలోకి రానున్నారు.
EPFO నుంచి లోన్ తీసుకోవచ్చా? PF ఖాతా నుంచి డబ్బులు పొందేందుకు రూల్స్, షరతులు ఇవే
వేతన పరిమితి పెంపుతో EPFO పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు వర్తించే నిబంధనల ప్రకారం పలు ప్రయోజనాలు అందనున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధి (EPF)లో పొదుపుతో పాటు ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) ద్వారా పెన్షన్ ప్రయోజనాలు, ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) ద్వారా బీమా రక్షణ పొందే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతతో పాటు, కొన్ని సందర్భాల్లో కుటుంబానికి బీమా రక్షణ కూడా అందుతుంది.
EPFO వేతన పరిమితిలో 2004 నుంచి 2014 వరకు ఎలాంటి మార్పు చేయలేదు. అనంతరం 2014 సెప్టెంబర్లో పరిమితిని రూ.6,500 నుంచి రూ.15,000కు పెంచారు. అప్పటి నుంచి అదే పరిమితి కొనసాగుతోంది. గత 12 ఏళ్లలో వేతనాలు, ఆదాయాలు పెరగడంతో పాటు దేశంలో అధికారిక ఉపాధి కూడా విస్తరించింది. అనేక రాష్ట్రాలు, రంగాల్లో కనీస వేతనాలు కూడా ప్రస్తుత రూ.15,000 పరిమితికి చేరువయ్యాయి. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఇప్పుడు వేతన పరిమితిని రూ.25,000కు పెంచింది.
EPFO వేతన పరిమితి పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై కూడా అదనపు ఆర్థిక భారం పడనుంది. ప్రస్తుతం ఉన్న వార్షిక బడ్జెట్ మద్దతు సుమారు రూ.10,250 కోట్లతో పోలిస్తే, సవరించిన విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వార్షిక వ్యయం సుమారు రూ.11,339 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఐదేళ్ల కాలానికి ఈ అదనపు వ్యయం సుమారు రూ.56,696 కోట్లుగా ఉంటుందని కేంద్రం తెలిపింది. ఈ ప్రతిపాదనపై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు జరిగాయి. 2026 జూన్ 16న జరిగిన వ్యయ ఆర్థిక కమిటీ సమావేశంలోనూ దీనికి సిఫార్సు లభించింది.
ప్రస్తుతం EPFO దేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. తాజా గణాంకాల ప్రకారం సుమారు 7.68 లక్షల కాంట్రిబ్యూటింగ్ సంస్థల ద్వారా 7.98 కోట్ల మంది సభ్యులు తమ వాటాలను చెల్లిస్తున్నారు. ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) ద్వారా సుమారు 82 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనాలు పొందుతున్నారు. EPF సభ్యత్వానికి అనుసంధానంగా EDLI పథకం బీమా రక్షణను అందిస్తోంది.
వేతన పరిమితి పెంపు ద్వారా మరింత మంది ఉద్యోగులను అధికారిక సామాజిక భద్రతా వ్యవస్థలోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ భద్రతను బలోపేతం చేయడంతో పాటు, అధికారిక ఉపాధి విస్తరణకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. కొత్త పరిమితిని అమలు చేసేందుకు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో పాటు EPFO అవసరమైన చట్టపరమైన, పరిపాలనా చర్యలను చేపట్టనుంది.