Rajinikanth Meets PM Modi: రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీని కలిసిన రజినీకాంత్, వారిని కలవడం ఆనందంగా ఉందంటూ ట్వీట్
Rajinikanth Meets PM Narendra Modi (Photo Credits: Twitter)

సూపర్ స్టార్ రజనీకాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న సంగతి విదితమే. సహజంగా జాతీయ సినిమా అవార్డులను, పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందిస్తారు. అయితే ఇటీవల జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రజనీకాంత్ తో పాటు సినిమా రంగానికి చెందిన అవార్డు గ్రహీతలు పురస్కారాలను అందుకున్నారు.

తాజాగా రజనీకాంత్, ఆయన శ్రీమతి లత న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ విషయాన్ని రజనీకాంత్ ఫోటోలతో పాటు ట్వీట్ చేస్తూ, ‘గౌరవనీయులైన రాష్ట్రపతి, ప్రధాన మంత్రిని కలవడం మరియు అభినందించడం చాలా ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం నాకిచ్చిన ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును నన్ను నటుడిగా గుర్తించి, తీర్చిదిద్దిన నా గురువు శ్రీ కె. బాలచందర్‌గారికి, నా పెద్దన్నయ్య శ్రీ సత్యన్నారాయణరావు గైక్వాడ్‌కు, నా స్నేహితుడు శ్రీ రాజ్ బహదూర్‌కు.. నా సినీ కుటుంబానికి చెందిన నిర్మాతలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, సహ నటీనటులకు, పంపిణీదారులకు, థియేటర్ల యజమానులకు.. మీడియా మిత్రులకు.. నన్ను ఎంతగానో ఆరాధించే నా అభిమానులకు మరియు నాకు దైవ సమానులైన తమిళ ప్రజలకు అంకితం ఇస్తున్నాను..’’ అని రజనీకాంత్ ఈ లేఖలో తెలిపిన సంగతి విదితమే.