APSET 2020: విద్యార్థులు రెడీ అయ్యారా..రేపట్నుంచే ఏపీ సెట్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి సురేష్
AP Educational minister Adimulapu Suresh (Photo-Twitter)

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ సహా వివిధ వృత్తి విద్యాకోర్సుల్లోప్రవేశాలకు గురువారం నుంచి ‘ఏపీ సెట్స్‌’ (APSET 2020) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో అన్ని నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు (Andhra Pradesh State Eligibility Test) సన్నాహాలు చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

సెప్టెంబర్ 10వ తేదీనుంచి వరుసగా ఏపీసెట్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి సురేష్ (adimulapu suresh) మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

ఐసెట్‌తో ఆరంభం కానున్న ఈ సెట్స్ ను టీసీఎస్, ఏపీ ఆన్‌లైన్‌ సంయుక్తంగా ఆన్‌లైన్‌లో ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఐసెట్‌ 10, 11వ తేదీల్లో, ఈసెట్‌ 14న, ఎంసెట్‌ 17 నుంచి 25 వరకు, పీజీసెట్‌ 28న, ఎడ్‌సెట్, లాసెట్‌ అక్టోబర్‌ 1న, పీఈసెట్‌ అక్టోబర్‌ 2 నుంచి 5 వరకు ఉంటాయి. సెట్‌ పరీక్షలకు సెంటర్లతో పాటు స్లాట్స్‌ను కూడా పెంచారు.

సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఇంజనీరింగ్‌ ఎంసెట్

పలు జాగ్రత్తలు

ప్రతి పరీక్ష కేంద్రాన్ని ముందుగానే శానిటైజ్‌ చేసి సిబ్బందికి కిట్స్‌ అందిస్తారు. మాస్కులు, గ్లౌజ్‌లు, స్ప్రేయింగ్‌ మిషన్లు, థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి సెంటర్‌లో ఐసొలేషన్‌ గదులు . టెంపరేచర్‌ నిర్ణీత పరిమాణం కన్నా ఎక్కువగా ఉన్న వారికి ఆ గదుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, మానిటరింగ్‌ డెస్కులు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు బార్‌కోడ్‌ హాల్‌ టికెట్లు జారీ చేసి సూచనలు, రోడ్‌ మ్యాపులను పొందుపరుస్తున్నారు. విద్యార్థులకోసం హెల్ప్‌లైన్‌ డెస్కు, ఫోన్‌ నంబర్లు అందుబాటులోకి. ప్రతి అభ్యర్థి కోవిడ్‌ 19పై డిక్లరేషన్‌ సమర్పించాలి.మాస్కులు, గ్లౌజ్‌లు తప్పనిసరిగా ధరించాలి.

సెప్టెంబర్ 30 వరకు ఏపీలో నో స్కూల్స్

కోవిడ్‌ కారణంగా మూతపడ్డ పాఠశాలను తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. దీనిపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని అక్టోబర్ 5 నుండి స్కూల్స్ ఓపెన్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అయితే ఉన్నతాధికారుల సూచనల మేరకు అన్‌లాక్ 5 మార్గదర్శకాలు వచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

విద్యార్థులకు అందించే విద్యా కానుకను ఇప్పటికే సిద్ధం చేశామని మంత్రి స్పష్టం చేశారు. కరోనా అనంతరం కాలేజీలు, యునివర్సిటీల్లో అనేక మార్పులు చోటుచేసునున్నాయని తెలిపారు. కరోనా తర్వాత పరిస్థితులు అంచనా వేసి అనేక మార్గదర్శకాలు సిద్దం చేశామని పేర్కొన్నారు