Odisha Train Crash: ఆ 52 మృతదేహాలు ఎవరివో ఇంకా సస్పెన్సే! ఒడిశా రైలు ప్రమాదంలో మృతుల గుర్తింపు కష్టతరం, ఎయిమ్స్ మార్చురిలోనే డెడ్బాడీస్
52 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. ఎయిమ్స్ భువనేశ్వర్లో భద్రపరిచిన ఈ మృతదేహాల కోసం ఎవరూ ముందుకు రావడం లేదు. జూన్ 2న బాలాసోర్ సమీపంలో లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది.
Balasore, June 30: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం (Odisha Train Crash) జరిగి నెల రోజులవుతున్నా 52 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. ఎయిమ్స్ భువనేశ్వర్లో భద్రపరిచిన ఈ మృతదేహాల కోసం ఎవరూ ముందుకు రావడం లేదు. జూన్ 2న బాలాసోర్ సమీపంలో లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దాని బోగీలు మెయిన్ లైన్పై పడగా హౌరా వెళ్తున్న షాలిమార్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 291 మంది మరణించగా వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. మూడు రైళ్ల ప్రమాదంపై రైల్వే కమిటీతోపాటు సీబీఐ కూడా దర్యాప్తు చేస్తున్నది. కాగా, ప్రమాదం తర్వాత వందలాది మృతదేహాలను భువనేశ్వర్లోని ఎయిమ్స్కు తరలించారు. వాటిలో 81 మృతదేహాలు ఇంకా అక్కడ ఉన్నాయి. మృతదేహాలు తమ వారివే అని పలువురు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించారు. చనిపోయిన వారిని గుర్తించేందుకు ఆయా నమూనాలను డీఎన్ఏ పరీక్ష కోసం ఢిల్లీ పంపారు.
మరోవైపు 29 నమూనాలకు సంబంధించిన డీఎన్ఏ రిపోర్టులు అందినట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సులోచనా దాస్ శుక్రవారం తెలిపారు. దీంతో మృతుల బంధువులకు ఈ సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. గుర్తించిన 29 మృతదేహాల్లో ఐదింటిని వారికి అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి ఊర్లకు మృతదేహాల తరలింపు కోసం రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.
కాగా, మృతదేహాలను ఊర్లకు తీసుకెళ్లని పక్షంలో బంధువుల విన్నపం మేరకు అంత్యక్రియల కోసం భువనేశ్వరంలోని రెండు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసినట్లు మేయర్ సులోచనా దాస్ తెలిపారు. మూడు రైళ్ల ప్రమాదంలో మరణించిన 291 మందిలో 52 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Jun 30, 2023 09:23 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

