Rajasthan Shocker: రాజస్థాన్‌లో దారుణం, షాపు ఎదుట చెత్త వేసినందుకు వాగ్వాదం, కిరాణా షాపు యజమాని దాడిలో ఉద్యోగి మృతి
Representational Image | (Photo Credits: PTI)

Kota, October 26: రాజస్థాన్‌(Rajasthan)లో దారుణం జరిగింది. తన షాపు ముందు చెత్త వేసినందుకు వృద్ధుడిని హత్య చేశారు ఓ వ్యక్తి. కోటా జిల్లా రాయ్‌ఘర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ షాపులో పని చేస్తున్న 68 ఏళ్ల పాదెం కుమార్ జైన్‌ అనే వ్యక్తి ఆదివారం ఉదయం దుకాణాన్ని శుభ్రపరిచి, ఆ చెత్తను ఎదురుగా ఉన్న కిరాణా షాపు వద్ద పడవేశాడు.  దీంతో కోపోద్రిక్తుడైన కిరాణా షాపు యజమాని అతని వాగ్వాదానికి దిగాడు.

కిరాణా షాపు యజమాని సోహన్‌లాల్‌ మాలి చెత్త పారవేసిన షాప్‌ కీపర్‌ను దూషిస్తూ దాడికి పాల్పడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇరువరి మధ్య గొడవ పెద్దగా మారడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పారతో షాప్ కీపర్‌ పాదెం కుమార్ జైన్‌పై దాడి చేశారు సోహన్‌ లాల్‌. దీంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.

తీవ్రంగా గాయపడ్డ పాదెం కుమార్ జైన్‌ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు స్థానికులు.  అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగా బాధితుడు మరణించాడు. పాదెం కుమార్ జైన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అనంతరం శవపరీక్ష నిర్వహించి మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు సోహన్‌ లాల్‌పై ఐపీసీ సెక్షన్‌ 307(IPC 307) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.