New CMs In 3 States: మూడు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల ఎంపిక దాదాపు పూర్తి, మోదీ నివాసంలో సుదీర్ఘంగా చ‌ర్చించిన బీజేపీ కీల‌క నేతలు, రెండు రోజుల్లో ప్ర‌క‌టించే అవ‌కాశం

New Delhi, Dec 07: ఐదు రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికారం చేపట్టబోయే పార్టీలేవో తేలిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కాబోయే ముఖ్యమంత్రులెవరన్న (New CMs) అంశంపైనే. ముఖ్యంగా బీజేపీ గెలిచిన రాజస్థాన్‌ (Rajastan), మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh), ఛత్తీస్‌గఢ్‌లలో (Chhattisgarh) సీఎంల ఎంపిక కత్తిమీద సాములా తయారైంది. ఈ రాష్ట్రాల్లో బీజీపీ కొత్త ముఖాలనే సీఎం అభ్యర్థులుగా నియమిస్తుందన్న ప్రచారం సాగుతున్నది. గెలిస్తే ఆయా రాష్ట్రాల్లో ఎవరు సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తారన్న విషయాన్ని చెప్పకుండానే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. ఫలితాల తర్వాత మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, రాజస్థాన్‌లో మాజీ సీఎం వసుంధర రాజే, ఛత్తీస్‌గఢ్‌లో మాజీ సీఎం రమణ్‌ సింగ్‌ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

Amit Shah on 2024 Polls: మళ్లీ ప్రధానిగా వచ్చేది మోదీనే, రాగానే జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా ఏరిపారేస్తాం, లోక్‌సభ వేదికగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు 

అయితే సీఎంల అభ్యర్థిత్వంపై గుంభనంగా వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీ ఈసారి మూడు రాష్ట్రాల్లోనూ కొత్త వారినే సీఎం పీఠంపై కూర్చోబెడుతుందన్న ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు ముఖ్యమంత్రుల ఎంపిక కోసం ప్రధాని మోదీ బుధవారం తన నివాసంలో సుమారు ఐదు గంటల పాటు అమిత్‌ షా, నడ్డాలతో సమావేశమయ్యారు. సీఎంల ఎంపిక పూర్తయ్యిందని, ఒకటి రెండు రోజుల్లో పేర్లు ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.