Farmers' Protest: రైతుల ఉద్యమానికి మద్దతుగా మత ప్రబోధకుడు ఆత్మహత్య, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిన సుప్రీంకోర్టు, కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపిన అత్యున్నత ధర్మాసనం

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 21 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు (Farmers' Protest) సంఘీభావంగా హరియాణాలోని కర్నాల్‌కు చెందిన మత ప్రబోధకుడు సంత్‌ బాబా రామ్‌ సింగ్‌(65) బుధవారం ఆత్మహత్య (Sikh Priest Baba Ram Singh Dies By Suicide) చేసుకున్నారు.

Farmers' Protest: రైతుల ఉద్యమానికి మద్దతుగా మత ప్రబోధకుడు ఆత్మహత్య, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిన సుప్రీంకోర్టు, కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపిన అత్యున్నత ధర్మాసనం
Sant Baba Ram Singh (Photo Credits: Twitter)

New Delhi, Dec 17: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 21 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు (Farmers' Protest) సంఘీభావంగా హరియాణాలోని కర్నాల్‌కు చెందిన మత ప్రబోధకుడు సంత్‌ బాబా రామ్‌ సింగ్‌(65) బుధవారం ఆత్మహత్య (Sikh Priest Baba Ram Singh Dies By Suicide) చేసుకున్నారు. ఢిల్లీ శివార్లలోని సింఘు సరిహద్దు (Singhu Border) వద్ద తుపాకీతో కాల్చుకున్నారు. హరియాణా శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (HSGMC) సహా పలు ఆధ్యాత్మిక సంస్థల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు.

బాబా రామ్‌సింగ్‌ మృతదేహం సమీపంలో ఆయన పంజాబీలో రాసిన ఆత్మాహుతి లేఖ లభించింది. హక్కుల కోసం రోడ్డుపై ఆందోళన చేస్తున్న రైతుల దీనస్థితిని, వారికి న్యాయం చేయకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేతను చూసి తట్టుకోలేకపోతున్నానని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. దీంతో పాటుగా రైతులకు మద్దతుగా పలువురు తమకందిన ప్రభుత్వ పురస్కారాలను వెనక్కు ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ లేఖలో గుర్తు చేశారు.

ఆయన రాసిన లేఖ ప్రకారం., రైతులకు మద్దతుగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ సేవకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇది ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా తీసుకుంటున్న చర్య’ అని వివరించారు. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. రామ్‌సింగ్‌ మృతికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఆత్మహత్యకు ప్రధాని మోదీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ రాక్షసత్వం అన్ని హద్దులు దాటిందని మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రైతులను ప్రతిపక్షాలు తప్పుదారి పట్టించాయి, దిల్లీ కేంద్రంగా భారీ కుట్ర జరిగింది, రైతు సంక్షేమానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

ఇదిలా ఉంటే రైతులతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో ప్రతిష్టంభన ఎప్పటికీ తొలగకపోవడంతో సుప్రీంకోర్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉభయపక్షాలూ తమ వైఖరులను మార్చుకోకపోవడంతో తానే ఓ కమిటీని (Supreme Court plans to form committee of farmers) ఏర్పాటుచేయాలని నిశ్చయించింది. చూస్తుంటే మీరు జరుపుతున్న సంప్రదింపులు ఎలాంటి ఫలితాన్నీ ఇవ్వడం లేదు. అవి విఫలమవుతాయి. మీ వల్ల కావడం లేదు. మేమే ఓ కమిటీని వేస్తాం. అందులో ఆందోళన జరుపుతున్న రైతుసంఘాల నుంచే కాక- దేశంలోని అన్ని రెతుసంఘాల నుంచి ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. ఇది జరక్కపోతే ఈ సమస్య జాతీయ సమస్యగా మారే ప్రమాదముంది’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ బోబ్డే, జస్టిస్‌ వి రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు స్పష్టం చేసింది.

చర్చలు ఫలవంతం కావాలన్న అభిలాశ ఇరుపక్షాలకూ ఉండాలని, అప్పుడే చర్చలు ఫలవంతం అవుతాయని కోర్టు అభిప్రాయపడింది. అటువంటి సంస్థల పేర్లను తెలియజేయాల్సిందిగా కోర్టు, ప్రభుత్వం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ని కోరింది. చర్చల్లో పాల్గొనే ప్రతినిధుల జాబితా తయారుచేసి ఇవ్వండి. ఆందోళనలపై వివిధ సంఘాల నుంచి పిటిషన్లు వేసిన రైతునేతలందరినీ ఈ కేసులో ఇంప్లీడ్‌ చేస్తున్నాం’ అని బెంచ్‌ వెల్లడించింది.

చట్టాలు రద్దు చేస్తారా లేదా? ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రైతులు, ఉద్యమానికి మద్ధతుగా పంజాబ్‌ డీఐజీ రాజీనామా,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒకరోజు నిరాహార దీక్ష

రైతులతో చర్చలకు ఇప్పటికీ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అయితే ఈ ఆందోళన ఇపుడు రైతుల చేతిలో నుంచి వేరే వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోయింది. చర్చలకు వస్తూనే ఆ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ దగ్గరే రైతులు ఆగిపోతున్నారు. ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ చేయదు. ప్రభుత్వంతో చర్చలు జరిపేట్లు కోర్టు వారికి ఆదేశాలివ్వాలి. క్లాజుల వారీగా చర్చిందేందుకు సిద్ధం’ అని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలియపర్చారు.

రైతు ఆందోళనలపై సుప్రీంకోర్టు సూచించినట్లుగా కమిటీని ఏర్పాటు చేయడం వల్ల పరిష్కారం లభించదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దే ఏకైక పరిష్కారమని పేర్కొన్నాయి. కమిటీని ఏర్పాటు చేస్తామని చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించిందని, ఆ ప్రతిపాదనను అప్పుడే తిరస్కరించామని రాష్ట్రీయ కిసాన్‌ మజ్దూర్‌ సభ నేత అభిమన్యు కోహర్‌ వెల్లడించారు. కాగా ఈ కమిటీని బిల్లుల రూపకల్పనకు ముందే వేయాల్సింది... చట్టాల ఆమోదం తరువాత కాదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 35 సంఘాల నేతలతో ఐదురౌండ్ల చర్చలు జరిపింది. అంటే ఇక్కడ ఉన్నదీ ప్రభుత్వ, రైతుసంఘాల ప్రతినిధులే. మరేంటి తేడా? కొత్త కమిటీ చేసేదేముంటుంది? ఇపుడు కావాల్సిందల్లా చట్టాల రద్దు. అది జరగనంత వరకూ ఈ ప్రతిష్టంభన వీడదు’ అన్నారు.

ఇప్పటివరకు చర్చలు జరిపిన ప్రభుత్వ ప్రతినిధులు, రైతు ప్రతినిధులు కమిటీతో సమానమేనని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, దానిపై ప్రభుత్వ స్పందనను గమనించిన తరువాత ఈ విషయంపై మాట్లాడుతామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ పేర్కొన్నారు. కాగా- ప్రభుత్వం కొన్ని రైతు సంఘాలతో ప్రతీరోజూ విడిగా చర్చలు జరపడాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా నిరసించింది. వివిధ రాష్ట్రాల యూనియన్లతో సమాంతర చర్చలు మానుకోవాలని మోర్చా కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌కు పంపిన లేఖలో కోరింది. అదే విధంగా ఆందోళన చేస్తున్న రైతులను రోడ్లపై నుంచి తొలగించి వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులను తీర్చాలంటూ రిషభ్‌ శర్మ అనే విద్యార్థి దాఖలు చేసిన పిటిషన్‌పై వెంటనే సమాధానమివ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది.

సుప్రీం చేయాల్సినది చట్టాల రద్దు కాదు. చట్టాల రాజ్యాంగబద్ధతను తేల్చడం. ఈ పనిని సుప్రీంకోర్టే చేయగలదు. చట్టాల అవసరం, సాధ్యాసాధ్యాలు సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశం కాదు. వాటిని రైతులు, ప్రభుత్వాధినేతలు చూసుకుంటారు. సుప్రీం పర్యవేక్షణలో చర్చలు జరగాలన్నది తప్పుడు మార్గం’ అని స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌ ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు. టిక్రీ సరిహద్దు పాయింట్‌ వద్ద రైతుల ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌(ఏక్‌తా ఉగ్రహాన్‌) కూడా ఈ కమిటీ ఏర్పాటును వ్యతిరేకించింది.

రైతులు 21వ రోజు కూడా తమ నిరసన కొనసాగించారు. ఢిల్లీ- నొయిడా మార్గంలోని చిలియా సరిహద్దు పాయింట్‌ను దిగ్బంధించడంతో కొన్ని గంటలపాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిలియా పాయింట్‌ను డిసెంబరు 1 నుంచి దాదాపుగా మూసేశారు. అపుడపుడూ తెరుస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Dec 17, 2020 08:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).