PM-SHRI Schools: పీఎం–శ్రీ స్కూళ్ల పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం, పీఎం–శ్రీ కింద ఐదేళ్లలో రూ.27,360 కోట్లతో దేశవ్యాప్తంగా 14,597 పాఠశాలల అభివృద్ధి
Schools

New Delhi, Sep 8: పీఎం–శ్రీ పథకానికి (PM-SHRI Schools) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం–శ్రీ యోజన, పీఎం గతిశక్తికి సంబంధించిన రైల్వే ల్యాండ్‌ పాలసీ సవరణకు ఆమోదం తెలిపారు. అలాగే పలు ఇతర కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళలో రూ.1,957 కోట్లతో కొచ్చీ మెట్రో రైల్‌ ప్రాజెక్టు రెండో దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

విద్యార్థులకు లబ్ధి చేకూరేలా ఒక దేశంలోని కోర్సులు, విద్యార్హతలను మరో దేశం గుర్తించేలా యూకే–భారత్‌ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని కేబినెట్‌ ఆమోదించింది. పీఎం–శ్రీ కింద ఐదేళ్లలో రూ.27,360 కోట్లతో (Cabinet Approves Rs 27,360 Crore Scheme) దేశవ్యాప్తంగా 14,597 పాఠశాలలను పీఎం–శ్రీ స్కూళ్లుగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. పీఎం–శ్రీ స్కూళ్లలో ఆధునిక విద్యావిధానం అమలు చేస్తారు.

నీట్ యూజీ పరీక్షా ఫలితాలు విడుదల, రాజస్థాన్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్, తెలంగాణ విద్యార్థికి 5వ ర్యాంక్, ఫలితాలను neet.nta.nic.in ద్వారా చెక్ చేసుకోండి

స్మార్ట్‌ తరగతి గదులు, క్రీడలు, సదుపాయాలపై పథకం దృష్టి సారిస్తుంది. వీటిని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. దీనికింద రాష్ట్రాలు, స్కూళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంతో 18.7 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని అంచనా.

దీంతో పాటుగా రైల్వే కొత్త ల్యాండ్‌ పాలసీ ప్రతిపాదనలో కార్గో, పబ్లిక్‌ యుటిలిటీ, రైల్వేల ప్రత్యేక వినియోగాల్లో సవరణలు చేశారు. రైల్వే భూమిని దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే విధానం రాబోయే 90 రోజుల్లో అమలవుతుందని కేంద్ర సమాచార మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. ‘‘ఐదేళ్లలో 300 కార్గో టెర్మినళ్లను అభివృద్ధి చేస్తాం. తద్వారా 1.25 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. కార్గో టెర్మినళ్లతో సరుకు రవాణాలో రైల్వే వాటా కూడా పెరుగుతుంది’’ అని తెలిపారు.డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో పరస్పరం సహకరించుకోవడానికి వీలుగా భారత్‌–మాల్దీవుల మధ్య ఇటీవల కుదిరిన అవగాహనా ఒప్పందానికి(ఎంఓయూ) ఆమోదం తెలియజేసింది.