PM Modi In Kolkata: చంపుకోవడం, కొట్టుకోవడం భారతదేశ చరిత్ర కాదు, కలకత్తా పర్యటనలో ప్రధాని మోడీ, ప్రధానిని కలిసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీఏఏ, ఎన్నార్సీలపై ఢిల్లీలో చర్చిద్దామన్న పీఎం మోడీ, అక్కడక్కడా నిరసన సెగలు
PM Modi In Kolkata (Photo-ANI)

Kolkata, January 12: పోర్ట్ ఆఫ్ కలకత్తా (కేఓపీటీ)(Port of Kolkata) 150వ వార్షికోత్సవంతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం కోల్ కతాకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి( Prime Minister Narendra Modi) ఘన స్వాగతం లభించింది. బోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి కలకత్తా బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా మోడీని మర్యాదపూర్వకంగా సీఎం మమత బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee) కలిశారు. ఈ భేటీ అనంతరం, మీడియాతో మమత మాట్లాడుతూ, జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), (CAA)జాతీయ పౌర పట్టిక , (NRC) జాతీయ జనాభా జాబితా (NRP)పై తాము అసంతృప్తిగా ఉన్న విషయంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలను మోడీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.

అయితే..కొన్ని కార్యక్రమాల వల్ల ఇక్కడకు రావడం జరిగిందని, ఢిల్లీలో ఈ విషయాలు తర్వలో చర్చిద్దామని మోడీ చెప్పినట్లు బెంగాల్ సీఎం తెలిపారు. ఇతర విషయాలు చర్చించేందుకు మోడీని కలవడం జరిగిందన్నారు.

Update by ANI

సీఏఏను సీఎం మమత బెనర్జీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు మమత. బెంగాల్‌లో సీఏఏను అమలు చేయబోమని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

Update by ANI

కాగా, మోడీ రాకను నిరసిస్తూ పలు విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. విమానాశ్రయం వద్ద ప్రధానికి వ్యతిరేకంగా బ్యానర్లు కట్టారు. ‘గో బ్యాక్ మోడీ’ అని రాసి ఉన్న ప్లకార్డులను చేతబూనిన విద్యార్థులు తమ నిరసనలు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వామపక్ష సంఘాల కార్యకర్తలు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనల నేపథ్యంలో నగరంలోని కీలకప్రాంతాల్లో పోలీసులను మోహరించారు.

Update by ANI

 

శనివారం రాత్రి ఆయన హౌరా జిల్లాలో ఉన్న రామకృష్ణ మిషన్‌ ప్రధానకార్యాలయం బేలూర్‌ మఠంలో బస చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, తదితర ప్రముఖులు ఎందరో ఈ మఠాన్ని గతంలో పలుమార్లు సందర్శించినప్పటికీ ఎవరూ కూడా అక్కడ బస చేయలేదని మఠం అధికారులు తెలిపారు. నేడు కోల్‌కతా పోర్ట్‌ 150వ వార్షికోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Update by ANI

 

ప్రధాని మోడీతో సీఎం మమతా బెనర్జీ సమావేశం కావడంపై వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చూస్తూ టీఎంసీ విద్యార్థి విభాగం ధర్నా జరుగుతుండగా అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విరగ్గొట్టారు. మోడీతో భేటీపై మమతా వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే ప్రధానితో సమావేశం అనంతరం సీఎం మమత నేరుగా అక్కడికి సమీపంలోనే టీఎంసీ విద్యార్థి విభాగం చేపట్టిన సీఏఏ వ్యతిరేక ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లారు. సీఏఏ అమలుపై హోం శాఖ జారీ చేసిన గెజిట్‌పై ఆ ధర్నాలో ఆమె మాట్లాడారు. ‘రాష్ట్రంలో సీఏఏ చట్టం కాగితాలపైనే ఉంటుంది. దీనిని అమలు చేసే ప్రసక్తే లేదు. పార్లమెంట్‌లో మెజారిటీ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేయడం కుదరదు’అని తెలిపారు.

ప్రధాని మోడీ స్పీచ్

దేశాన్ని వారసత్వ పర్యాటక కేంద్రంగా మారుస్తామని, ప్రపంచానికి మన ఘనతను చాటుతామని ప్రధాని మోడీ కలకత్తాలో అన్నారు. కోల్‌కతాలో పునర్నిర్మించిన బ్రిటిష్‌ కాలంనాటి మూడంతస్తుల కరెన్సీ బిల్డింగ్‌ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. బెల్వెడెరె హౌస్, మెట్‌కాఫ్‌ హాల్, విక్టోరియా మెమోరియల్‌ హాల్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి షెడ్యూల్‌ ప్రకారం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ రావాల్సి ఉండగా ఆమెకు బదులుగా రాష్ట్ర మంత్రి హకీం హాజరయ్యారు. దేశంలోని కొన్ని పురాతన మ్యూజియంలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు.

Update by ANI

 

డీమ్డ్‌ వర్సిటీ హోదాతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. బ్రిటిష్‌ హయాంలో, స్వాతంత్య్రానంతరం రాసిన దేశ చరిత్రలో మనకు తెలియని ఎన్నో అంశాలు మరుగున పడిపోయాయని తెలిపారు. ‘అధికారం కోసం తండ్రిని కొడుకు చంపడం, సోదరులు కొట్లాడుకోవడం వంటివి మనం చూశాం. ఇవి కాదు భారత దేశ చరిత్ర’ అని ఆయన అన్నారు. సీఏఏ వివాదాస్పదం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ‘ఇలాంటి సంక్షోభ సమయాల్లో జాతీయభావాన్ని మేలుకొల్పాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతి, చరిత్ర, తత్వశాస్త్రం జాతీయ భావమే మూలం’ అని వ్యాఖ్యానించారు.