Condom Politics: పిల్లలు ఎక్కువ మంది పుట్టకుండా కండోమ్‌లు వాడేది ముస్లింలే, ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన అసదుద్దీన్ ఒవైసీ
Asaduddin Owaisi and Modi (photo-ANI)

న్యూ ఢిల్లీ, మే 2: 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి భారతదేశ సంపదను పంచుతుందని గత వారం, ముస్లిం సమాజంపై పిఎం మోడీ కాంగ్రెస్‌పై పరోక్షంగా మండిపడిన విషయం విదితమే.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, అది ప్రజల సంపదను ముస్లింలకు పునఃపంపిణీ చేస్తుంది" అని రాజస్థాన్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోడీ అన్నారు. 2006 డిసెంబర్‌లో "మైనారిటీలు, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు దేశంలోని వనరులపై మొదట హక్కు కలిగి ఉండాలి" అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రధాని ప్రస్తావించారు.

దీనిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని మోదీకి కౌంటర్ విసిరారు. ఎక్కువ మంది సంతాపం ఉన్న వారికి, చొరబాటుదారులకు దేశ సంపదను తిరిగి పంచాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందంటూ మోదీ ఎన్నికల ప్రచారంలో చేసిన విమర్శలను తప్పుబట్టారు.  ఇంకెంత కాలం మసీదులు, దేవాలయాల పేరుతో ఓట్లు అడుగుతారు, ప్రధాని మోదీపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..

‘ఎక్కువగా కండోమ్ లు ఉపయోగించేది ముస్లింలే’ అని ఆదివారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించారు. ‘ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారని ప్రజల్లో ఎందుకు భయం సృష్టిస్తున్నారు? మోదీ ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం ముస్లింల జనాభా, సంతాన వృద్ధి తగ్గింది. ముస్లింలే ఎక్కువగా కండోమ్ లు వాడతారు. ఈ విషయం చెప్పేందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు’ అని అసదుద్దీన్ అన్నారు.

ముస్లింలు జనాభాపరంగా మెజారిటీగా మారతారని నరేంద్ర మోదీ హిందువుల్లో భయం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ముస్లింలపై ఇంకెంత కాలం భయాన్ని వ్యాప్తి చేస్తారని నిలదీశారు. తమ మతం వేరైనప్పటికీ తాము ఈ దేశానికి చెందిన వాళ్లమని స్పష్టం చేశారు. అధికార బీజేపీ చెబుతున్న మోదీ కీ గ్యారంటీ నినాదాన్ని కూడా ఆయన ఎద్దేవా చేశారు. దళితులు, ముస్లింలను ద్వేషించడమే మోదీ ఏకైక గ్యారంటీ అని చురకలంటించారు. అయితే ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ లేదా ప్రధాని మోదీ ఇంకా స్పందించలేదు.

రాజస్తాన్ లోని బన్స్ వారాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. జాతీయ కుల సర్వేలో భాగంగా ఆర్థిక, వ్యవస్థీకృత నివేదిక కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రణాళికలను మోదీ ప్రస్తావించారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను తన ప్రసంగంలో జోడించారు.

‘కాంగ్రెస్ పార్టీ దేశంలోని తల్లులు, సోదరీమణుల వద్ద ఉన్న బంగారం ఎంతో లెక్కగడతామని అంటోంది. ఆ తర్వాత దాన్ని సమాజానికి తిరిగి పంపిణీ చేస్తామంటోంది. గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశంలోని అన్ని వనరులపై ముస్లింలకే తొలి హక్కు ఉందని చెప్పింది’ అంటూ ఆ సభలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ వ్యాఖ్యల తర్వాత, కాంగ్రెస్ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి ఫిర్యాదు చేసింది, ఆ తర్వాత బీజేపీకి నోటీసు జారీ చేసింది.