Maharashtra: విశ్వాస పరీక్షలో నెగ్గిన ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర సర్కారుకు అనుకూలంగా ఓటు వేసిన 164 మంది ఎమ్మెల్యేలు, విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి 99 ఓట్లు
Eknath Shinde And Padnavis

Mumbai, July 4; మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే తన బలాన్ని నిరూపించుకున్నారు. ఈ ఉదయం జరిగిన విశ్వాస పరీక్షలో షిండే (Maharashtra CM Eknath Shinde) విజయం సాధించారు. శాసన సభలో జరిగిన ఓటింగ్ లో షిండేకు అనుకూలంగా 164 మంది ఎమ్మెల్యేలు ఓటు చేశారు. ఇందులో 40 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన షిండే మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా (Chief Minister Eknath Shinde) తన అధికారాన్ని కాపాడుకున్నారు. ఇక విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి.

నిన్నటిదాకా అఘాడి కూటమితో ఉన్న శివసేనకు చెందిన ఎమ్మెల్యే సంతోష్ బాంగర్ చివరి నిమిషంలో థాకరేకు షాకిచ్చారు. బల పరీక్షలో విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. షిండేకు మద్దతుగా బీజేపీతోపాటు బహుజన్ వికాస్ అఘాడి కూడా ఓటు వేసింది. ఇక విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మహా వికాస్ అఘాడి కూటమిలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలతో పాటు సమాజ్ వాద్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకి చెందిన ఓ ఎమ్మెల్యే ఓటు వేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు

కొన్ని వారాల నుంచి సాగుతున్న మ‌హారాష్ట్ర‌ అసెంబ్లీ సంక్షోభం అనూహ్య మ‌లుపులు తిరిగిన విష‌యం తెలిసిందే. శివ‌సేన రెబ‌ల్‌గా షిండే తిరుగుబాటు చేయ‌డంతో ఉద్ద‌వ్ ఠాక్రే త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో ఏక్‌నాథ్ సీఎం అయ్యారు.