Covid Omicron XE: కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఎక్స్‌ఈ లక్షణాలు ఇవే, జ్వరం, గొంతు నొప్పి, గొంతులో గరగర, దగ్గు, జలుబు, చర్మంపై దద్దర్లు, రంగు మారడం, జీర్ణకోశ సమస్యలు వంటి లక్షణాలు
Coronavirus Cases in India (Photo-PTI)

కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్లీ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ఎక్స్‌ఈ భారత్‌లోకి ప్రవేశించింది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 వేరియంట్ల కలయితో ఏర్పడిన ఈ కొత్త మ్యుటేషన్‌ వైరస్‌ (Covid Omicron XE) మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన మహిళకు సోకినట్లు బుధవారం గుర్తించారు. దీంతో ఈ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బారిన పడిన జాబితాలో భారత్‌ కూడా చేరినట్లయ్యింది. మరోవైపు ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తున్నది. అయితే కొందరికి స్వల్పంగానూ, మరికొందరికి తీవ్రంగానూ లక్షణాలు (Symptoms) ఉంటున్నట్లు తెలుస్తున్నది.

ముఖ్యంగా జ్వరం, గొంతు నొప్పి, గొంతులో గరగర, దగ్గు, జలుబు, చర్మంపై దద్దర్లు, రంగు మారడం, జీర్ణకోశ సమస్యలు వంటి లక్షణాలు ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ సోకిన వారిలో ప్రధానంగా కనిపించనున్నాయి. అలసట, కళ్లు తిరగడం వంటివి ప్రారంభంలో కనిపించే కొన్ని లక్షణాలు. తలనొప్పి, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, జ్వరం వంటి తర్వాత కనించే లక్షణాలు. గుండె దడ, గుండె జబ్బులు, తీవ్రమైన నరాల వ్యాధులు వంటి తీవ్రమైన లక్షణాలు కూడా ఈ వేరియంట్‌ వల్ల కలగవచ్చని తెలుస్తున్నది.

భారత్‌లో మళ్లీ కొత్త వేరియంట్లు, ముంబైలో ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ వేరియంట్, కాపా వేరియంట్‌‌లను కనుగొన్న అధికారులు

మరోవైపు వాసన, రుచి కోల్పోవడం వంటి అత్యంత సాధారణమైన కరోనా లక్షణాలు ఈ కొత్త వేరియంట్‌ బారినపడిన వారిలో చాలా అరుదుగా ఉంటాయని తెలుస్తుంది. అలాగే ఒకరి టీకా స్థితి, మునుపటి ఇన్ఫెక్షన్ల నుంచి పొందిన రోగనిరోధక శక్తి, వైరస్‌ తీవ్రత వంటివి కూడా ఆధారపడి ఉంటాయి. ఒమిక్రాన్‌ బీఏ.2 వేరియంట్‌ కన్నా పది శాతంమేర ఇది వ్యాపించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే దీని వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆధారాలు ఇప్పటి వరకు లేకపోవడం కొంత ఊరటనిస్తున్నది