Suresh Raina Arrested: ముంబైలో క్రికెటర్ సురేశ్ రైనా అరెస్ట్, కరోనా నిబంధనలను అతిక్రమించినందుకు గానూ అదుపులోకి తీసుకున్నామని తెలిపిన పోలీసులు, బెయిల్‌పై విడుదల
Suresh Raina (Photo Credits: Getty Images)

టీం ఇండియా క్రికెటర్ సురేశ్ రైనాను ముంబై పోలీసులు అరెస్టు (Suresh Raina Arrested) చేశారు. అతడితో పాటు సింగర్ గురు రంధ్వానాను కూడా ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై ఎయిర్ పోర్టుకు సమీపంలోని డ్రాగన్ ఫ్లై క్లబ్‌పై (Dragonfly Pub) ఆకస్మిక దాడి చేసిన పోలీసులు వీరిద్దరితో పాటు మరో 34 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు క్లబ్ సిబ్బంది కూడా ఉన్నారు. కాగా కరోనా నిబంధనలను అతిక్రమించినందుకు గానూ వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఈ విషయంపై సహర్ పోలీస్‌ స్టేషన్‌ సీనియర్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, నిర్ధారిత సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉండడంతో పాటు, కరోనా నిబంధనలు పాటించని నేపథ్యంలో డ్రాగన్ ఫ్లై క్లబ్‌పై రైడ్ చేసి 34 మందిని అరెస్టు చేశామని తెలిపారు.

అరెస్టైన వారిలో క్రికెటర్ సురేశ్ రైనా, సింగర్ గురు రంధ్వానా కూడా ఉన్నారని, ఏడుగురు హోటల్ సిబ్బందిని కూడా అరెస్టు చేశామని చెప్పారు. వారిపై ఐపీసీ సెక్షన్ 188, 269, 34 ప్రకారం కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఇదిలా ఉంటే అరెస్టైన కొద్ది సేపటికే సురేశ్ రైనా, గురు రంధ్వానాలు బెయిల్‌పై విడుదలయ్యారు.

నేటి నుంచి జనవరి 5 వరకు నైట్ కర్ఫ్యూ, కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం, ఇండియా నుంచి యూకేకి విమానాల సర్వీసు రద్దు, దేశంలో తాజాగా 19,556 మందికి కరోనా

అరెస్టయిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ అర్ధాంగి సుజానే ఖాన్ కూడా ఉన్నారు. నిర్దేశించిన సమయం మించి పబ్ తెరిచి ఉంచారని, ఇతరత్రా నియమాల ఉల్లంఘన కూడా జరిగిందని అరెస్ట్ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు. బ్రిటన్ లో కరోనా కొత్తరకం వెలుగు చూసిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.