Doubling Farmers' Income Row: రైతుల ఆదాయం రెట్టింపు అవ్వాలి, బ్యాంకులు ప్రధానంగా దీనిపై దృష్టి సారించాలి, 213వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్
Andhra Pradesh ys-jaganmohan-reddy-review-meeting (Photo-Twitter)

Amaravati, Dec 12: ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ ముందుకువెళుతున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా పరిపాలనలో నిర్ణయాలు తీసుకుంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం.. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతుల ఆదాయం ఎలా రెట్టింపు (Doubling Farmers' Income) అవుతుందన్న దానిపై బ్యాంకులు (Banks) ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.

పెట్టుబడి వ్యయం తగ్గడం, పంటలకు సరైన మార్కెటింగ్‌ సదుపాయాలు, విపత్తుల సమయంలో ఆదుకోవడం ద్వారా రైతులకు (Farmers) మేలు జరుగుతుందని సీఎం తెలిపారు. గత త్రైమాసికంలో రుణాల మంజూరులో 7.5 శాతం వృద్ధి నమోదు కావడం సంతోషకరమని, పంట రుణాలు 99 శాతం ఇచ్చారని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్‌ (AP CM YS Jagan) అధ్యక్షతన శుక్రవారం క్యాంపు కార్యాలయంలో 213 వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం (213th State Level Bankers Committee Meeting) జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్‌ వి.బ్రహ్మానందరెడ్డి, ఆర్బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ కె.నిఖిల, నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్‌ జన్నావర్‌తో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. యూబీఐ జీఎం లాల్‌సింగ్, యూబీఐ ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్‌రాయ్‌ (ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌) వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు.

Here's AP CMO Tweet

ఈ సంధర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులకు పెట్టుబడి వ్యయ్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున సహాయం చేస్తున్నాం. రాష్ట్రంలో 50 శాతం మంది రైతులకు అర హెక్టారు కన్నా తక్కువ భూమి ఉంది. 80 శాతం పెట్టుబడి వ్యయాన్ని రైతు భరోసా ద్వారా అందచేస్తున్నాం. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభానికి ముందు మే నెలలో రూ.7,500, పంట కోత సమయంలో రూ.4 వేలు, సంక్రాంతి సమయంలో మిగిలిన రూ.2 వేలు ఇస్తున్నామని తెలిపారు.

జగనన్న జీవ క్రాంతి పేరుతో ఏపీలో మరో కొత్త పథకం, రూ.1868.63 కోట్లు వ్యయంతో వెనుకబడిన వర్గాలకు చేయూత, రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ

వడ్డీ లేని రుణాల ప్రయోజనాన్ని పొందేలా రైతులను చైతన్యం చేస్తున్నాం. వడ్డీ లేని రుణాల కింద గత సర్కారు హయాంలో ఎగ్గొట్టిన అన్ని బకాయిలను పూర్తిగా చెల్లించాం. పంటల బీమా ప్రీమియం భారం రైతులపై పడకుండా చేశాం. వ్యవసాయ రంగంలో మేం తీసుకున్న అతి పెద్ద చర్యల్లో ఇది ఒకటి. రైతులు కట్టాల్సిన ప్రీమియంను మేమే చెల్లిస్తున్నాం. దీనివల్ల వ్యవసాయ రంగంలో పెద్ద మార్పులు వచ్చాయన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రైతులు పండించే పంటలకు భద్రత వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలను చేయి పట్టి నడిపిస్తాయి. విత్తనం వేసిన దగ్గర నుంచి పంటలు అమ్మే వరకూ ఆర్బీకేలు రైతులకు అండగా ఉంటాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులోకి తెచ్చి రైతులకు మేలు చేస్తున్నాయని సీఎం తెలిపారు.

ఆసరా, చేయూత పథకాల ద్వారా మహిళా సాధికారితకు అడుగులు వేస్తున్నామని వారు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు బ్యాంకర్లు తోడుగా నిలవాలని సీఎం కోరారు. జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారులకు రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని..వారికి బ్యాంకులు రుణాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ఆ వడ్డీలకు ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. చిరు వ్యాపారుల జీవితాలను మార్చడానికి బ్యాంకర్లు ముందడుగు వేయాలని సీఎం కోరారు.