YCP Reacts on Vallabhaneni Vamsi Arrest(X)

Vjy, Feb 13: కూటమి పాలనలో ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.వల్లభనేని వంశీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘వంశీ అరెస్టును ఖండిస్తున్నాము. ఉప సంహరించుకున్న కేసుపై అరెస్టు ఏమిటి?. కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు. ఇటువంటి రాజకీయాలు మంచిది కాదు. మరోసారి పునరావృతం కాకూడదు’ అంటూ హెచ్చరించారు.

వంశీ అరెస్ట్‌పై టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి స్పందించారు.వల్లభనేని వంశీ అరెస్టును ఖండిస్తున్నా. కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు, లోకేష్‌ ప్రతీకారంతోనే అరెస్ట్‌లు చేస్తున్నారు. వంశీ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి సంతోషపడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలందరిపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలని కోరారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడకు తరలిస్తున్న పోలీసులు, వివరాలివే

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అన్యాయంగా అరెస్టు చేశారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 30 మంది పోలీసులు ఇంటికెళ్లి మరీ బెదిరించారు. చట్టాన్ని చేతిలో తీసుకుని తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి అనుగుణంగా పోలీస్‌ వ్యవస్థ పనిచేస్తోంది. పౌర హక్కులను హరిస్తూ అక్రమ కేసులు పెడుతున్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తే విత్‌ డ్రా చేసుకుంటే మళ్లీ కేసు పెట్టడమేంటని మండిపడ్డారు.

కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదు. కేసు విత్ డ్రా చేసుకున్న తరవాత అరెస్టులు చేయడమేంటని మండిపడ్డారు.

దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. కక్షపూరితంగా వంశీని అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. కోర్టు వ్యాఖ్యలను కూడా కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు. కేవలం కక్ష సాధింపు కోసమే ఇలా ఇబ్బందులు పెడుతున్నారు. తప్పుడు కేసులపై కోర్టులు న్యాయం చేయాలి. భవిష్యత్‌ కాలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఎవరైన తప్పుడు కేసులు పెట్టారో వారిపై చట్టపరంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. వారికి శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు.