Andhra Pradesh: ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులను సురక్షితంగా రప్పించండి, కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌కు ఫోన్ చేసిన సీఎం జగన్
AP Chief Minister CM YS Jagan Mohan Reddy | File Photo.

Amaravati, Feb 25: ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి ఏపీ సీఎం జ‌గ‌న్ (AP CM YS Jagan) చ‌ర్య‌లు చేపట్టారు. ఇందులో భాగంగా కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌కు (Union Foreign Minister ) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను (Telugu students from Ukraine ) క్షేమంగా తీసుకురావడంపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ మేరకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే కేంద్రం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని జయశంకర్‌ ముఖ్యమంత్రికి వివరించారు.

ఉక్రెయిన్‌ పక్కదేశాలకు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా చర్యలు తీసుకొచ్చే దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు వారిని క్షేమంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రికి కూడా సీఎం జగన్‌ లేఖ రాశారు. అంతకుముందు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగువారిని భద్రంగా రప్పించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

ఉన్నతస్థాయి సమావేశంలో సీఎస్, సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. అధికారుల నుంచి వివరాల తెలుసుకున్న సీఎం జనగ్‌ కలెక్టర్ల స్థాయిలో కాల్‌సెంటర్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రపంచం తమను ఒంటరిగా వదిలేసింది, ర‌ష్యా పోరాటంలో మన పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరు సిద్ధంగా లేరని ఆవేదన వ్యక్తం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ

రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. వారి యోగక్షేమాలను కనుక్కుంటూ వారి భద్రతకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు వారితో సంప్రదిస్తూ తగిన మార్గనిర్దేశం చేయాలని, కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగువారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేయాలని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపులో రాష్ట్రం నుంచి తగిన సహకారం అందించాలని ఆదేశించారు.