AP Local Body Elections: ఎస్ఈసీకి మరో ట్విస్ట్..కరోనాతో పోరాడుతున్నాం, ఇప్పుడు ఎన్నికలు ప్రజాహితం కాదు, ఎస్ఈసీ నిమ్మగడ్డకు లేఖ రాసిన ఏపీ చీఫ్ సెక్రటరీ నీలంసాహ్ని
AP CS Neelam Sahni Letter To SEC Ramesh Kumar About Local Body polls (Photo-Youtube Grab)

Amaravati, Nov 18: ఏపీలో ఫిబ్రవరిలో ఎన్నికలు (AP Local Body Elections) నిర్వహిస్తామంటూ ఎన్నికల కమిషన్ స్టేట్ మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సర్కారు స్పందించింది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నీలంసాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు లేఖ (AP CS Neelam Sahni Letter To SEC) రాశారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేవని ఆమె లేఖలో స్పష్టం చేశారు.

రాష్ట్రంలో అధికార యంత్రాంగమంతా కరోనా విధుల్లో ఉన్నారని, ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాల్సిన అవసరం ఇప్పుడు లేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం ప్రధానంగా కోవిడ్ ఎదుర్కోవడంపైనే ఉందని నీలం సాహ్ని (AP CS Neelam Sahni) తెలిపారు. అదీకాక గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తామనడం ప్రజాహితం కాదని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోందని, ఒక రాష్ట్రాన్ని, మరో రాష్ట్రంతో పోల్చడం తగదన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే 6,890 మంది కరోనాతో మరణించారని, రాబోయే రోజుల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్రం కూడా తెలిపిందని ఆమె గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్‌ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అయ్యాక ఆ చర్యలకు శ్రీకారం చుట్టడం మేలుని పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిని ఎన్నికల కమిషన్‌ సానుకూలంగా పరిగణిస్తుందని భావిస్తున్నానని నీలంసాహ్ని లేఖలో ప్రస్తావించారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు, న్యాయపరమైన ఇబ్బందులు లేవని తెలిపిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్

రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించిందంటూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ (SEC Nimmagadda Ramesh kumar) మంగళవారం ప్రొసీడింగ్స్‌ పేరుతో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అందులో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏపీలో కరోనా ఉధృతి కూడా తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి పడిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందన్నారు.

తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని, ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని ఎస్ఈసీ అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని, ఎలక్షన్స్‌కు 4 వారాల ముందు కోడ్‌ అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం, రాజకీయ పక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు.