Ganta Srinivasarao: మాజీ మంత్రి గంటా దారెటు, ఇవాళ ముఖ్య అనుచరులతో కీలక సమావేశం నిర్వహించనున్న గంటా శ్రీనివాసరావు, టీడీపీలో కొనసాగుతారా? లేదా? ఉత్కంఠ
Ganta Srinivasa Rao (photo-ANI)

Vishakapatnam, March 14: మాజీ మం‍త్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) టీడీపీని వీడతారా?.. లేదంటే అయిష్టంగానే ఆ పార్టీలో కొనసాగుతారా? తన రాజకీయ భవిష్యత్తు కోసం గంటా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ చర్చే ప్రధానంగా నడుస్తోంది. చీపురుపల్లిలో పోటీ తన వల్ల కాదని గంటా చెబుతున్నా.. చంద్రబాబు (Chandrababu Naidu) మాత్రం పోటీ చేయాల్సిందేనని తేల్చేశారు. దీంతో ఆయన ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘‘మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేసేందుకు నన్ను సరైన అభ్యర్థిగా పార్టీ భావించింది. చీపురుపల్లిలో సీనియర్‌ లీడర్‌పై పోటీ చేస్తే బాగుంటుందని గట్టి ప్రతిపాదన పెట్టింది’’.. ఫిబ్రవరి 23వ తేదీ ప్రెస్‌మీట్‌లో గంటా శ్రీనివాసరావు చెప్పిన మాట. అయితే వెంటనే ఆయన వెనకడుగేశారు. చీపురుపల్లిలో అవకాశాలపై తన సహచరులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నానని చెబుతూనే.. అక్కడ నుంచి పోటీకి విముఖత ప్రదర్శిస్తూ వచ్చారు.

Andhra Pradesh Elections 2024: బీజేపీ రాకతో తగ్గిన జనసేన సీట్లు, మూడు పార్టీల మధ్య పూర్తి అయిన సీట్ల పంపకాలు, పొత్తులో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే.. 

‘ప్రతి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న మాట వాస్తవమే. కానీ, ఈసారి గెలిచిన చోట నుంచే మళ్లీ పోటీ చేయాలనుకున్నా’ ఇది మారిన గంటా స్వరం. ఈ క్రమంలో పదే పదే చంద్రబాబును కలుస్తూ.. తాను చీపురుపల్లిలో పోటీకి సిద్ధంగా లేనని, కాదని బలవంతంగా పోటీకి దించితే ఫలితం మరోలా ఉండొచ్చని మొరపెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం గంటాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బుధవారం కూడా ఆయన​ చంద్రబాబును కలిశారు. తన నిర్ణయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. గంటా శ్రీనివాస్‌ ఇవాళ తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్య అనుచరులతో గురువారం గంటా తన నివాసంలో భేటీ కానున్నారు. వాళ్లతో చర్చించి తన తర్వాతి అడుగులపై కీలక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది.