exam students

Vjy, Sep 13: ఏపీలో సీబీఎస్‌ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతి నుంచే పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చి, విద్యార్థుల సామర్థ్యాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

సీబీఎస్‌ఈ పరీక్షా విధానంలో పదో తరగతి విద్యార్థులు ఫెయిలైతే వారిపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ సీబీఎస్‌ఈ బడుల్లో 77,478 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. సీబీఎస్‌ఈ అనుబంధ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఇటీవల విద్యాశాఖ పరీక్షలు నిర్వహించగా.. 64 శాతం మంది తప్పారు.

 9 నుంచి 11వ తరగతుల్లో సాధించిన మార్కుల ఆధారంగా పన్నెండో తరగతి ఫలితాలు.. ఎన్సీఈఆర్టీ నిపుణుల కమిటీ సూచనలు

326 పాఠశాలల్లో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదు. 556 బడుల్లో 25 శాతం లోపే ఉత్తీర్ణత నమోదైంది. 66 బడుల్లో 26% - 50% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 77,478 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 49,410 మంది తప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి సీబీఎస్‌ఈ విద్యార్థులను రాష్ట్ర బోర్డు పరీక్షలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన మార్పులు తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను లోకేశ్‌ ఆదేశించారు.