Car Accident In krishna : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి, మరికొందరికీ గాయాలు, అతివేగమే ప్రమాదానికి కారణం, హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతున్న సమయంలో ప్రమాదం
two-cars-collided-and-four-people-killed-at-garikapadu-check-post-jaggayyapeta (Photo-ANI)

Jaggayyapeta, November 3: కృష్ణా జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం, గరికపాడు దగ్గర ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. గరికపాడు చెక్‌పోస్ట్‌ వద్ద రెండు కార్లు ఢీ కొనడంతో నలుగురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. ఓ కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారుపై అది పడింది.

వాటిల్లో ఒక కారులోని ప్రయాణికులు మహబూబ్‌నగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వివరించారు. మృతుల్లో ఇద్దరు గోపయ్య, బసవరెడ్డిలుగా గుర్తించారు.

మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన వారి కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి బయలుదేరారు. కార్లు అతివేగంగా రావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.