Banala Ramreddy Suicide Case: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆత్మహత్యకు కారణం అదేనా.. బాణాల రాంరెడ్డి సూ*సైడ్ వెనక ఏం జరిగింది..

భూవివాదాలు, అప్పుల భారం, రాజకీయ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో ఎదురైన ఒత్తిళ్లను తట్టుకోలేక 'నివీ డెవలపర్స్' అధినేత బాణాల రాంరెడ్డి (48) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Banala Ramreddy Suicide Case.jpg

Banala Ramreddy Suicide Case: భూవివాదాలు, అప్పుల భారం, రాజకీయ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో ఎదురైన ఒత్తిళ్లను తట్టుకోలేక 'నివీ డెవలపర్స్' అధినేత బాణాల రాంరెడ్డి (48) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరుకు చెందిన రాంరెడ్డి, హైదరాబాద్‌లోని మణికొండలో నివాసముంటున్నారు. బుధవారం సాయంత్రం స్వగ్రామమైన నేదునూరులోని తన చెల్లెలి ఫాంహౌస్‌లో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు.

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంరెడ్డి 2008లో తన బంధువు భాస్కర్ రెడ్డితో కలిసి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. మంఖాల్, కొంగరకలాన్ ప్రాంతాల్లో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా స్వల్ప కాలంలోనే మంచి లాభాలు గడించారు.

వీడియో ఇదిగో.. మెట్‌పల్లిలో తాగుబోతు వీరంగం.. ఆర్టీసీ బస్సును అడ్డుకుని డ్రైవర్, భార్యపై దాడికి యత్నం..

ఆ విజయంతో 2018లో పటాన్‌చెరువు ప్రాంతంలో సుమారు 280 ఎకరాల భూమిని డెవలప్‌మెంట్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం సొంత సంపాదనతో పాటు రూ. 100 కోట్లకు పైగా అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. అయితే, ఆ భూముల్లో కొన్నింటికి న్యాయపరమైన చిక్కులు రావడం, అనుమతులు లభించకపోవడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. దీనికితోడు భాగస్వామి భాస్కర్ రెడ్డి తన వాటా తీసుకుని వైదొలగడంతో రాంరెడ్డిపై ఒత్తిడి మరింత పెరిగింది.

ప్రాజెక్టు మొదటి ఫేజ్‌లో డెవలప్ చేసిన ప్లాట్లను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు రాంరెడ్డి హెచ్‌ఎండీఏ (HMDA)కి రూ. 20 కోట్లు చెల్లించినప్పటికీ, అధికారులు 1968 నాటి లింక్ డాక్యుమెంట్లు సమర్పించాలని కోరారు. ఆ పత్రాల్లో వ్యత్యాసాలు ఉండటంతో సమస్య చిక్కుముడిగా మారింది. అటు అప్పులిచ్చిన వారు, ఇటు అడ్వాన్స్‌లు చెల్లించిన కొనుగోలుదారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఆత్మహత్యకు ముందు రాంరెడ్డి తన ఫోన్‌లో రికార్డు చేసిన ఆడియో ప్రకారం.. 1968 నాటి లింక్ డాక్యుమెంట్లను సరిగ్గా పరిశీలించకుండా అగ్రిమెంట్ చేసుకోవడమే తాను చేసిన పెద్ద తప్పని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎవరెవరు ఎంత డబ్బు డిమాండ్ చేశారో వాయిస్ రికార్డులో వివరించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఆత్మహత్య వెనుక రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 280 ఎకరాల భారీ వెంచర్‌పై కన్నువేసిన కొందరు నేతలు ప్రారంభం నుంచే వాటాలు, పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారని, తాము అడిగినంత ఇస్తేనే ప్రాజెక్టు ముందుకు సాగుతుందని బెదిరించినట్లు సమాచారం. వారు అడిగినంత ఇవ్వలేకపోవడంతో రోడ్డు సౌకర్యం లేకుండా సమస్యలు సృష్టించడమే కాకుండా, రైతులను ఆయనపైకి రెచ్చగొట్టి భూములు వెనక్కి అడిగేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఆరుగురు రైతులకు సంబంధించిన వాయిస్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రాంరెడ్డి బావ కొడూరు ప్రవీణ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఆడియో రికార్డుల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement