CM KCR Districts Tour: వడగండ్ల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్, నాలుగు జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా పంట నష్టాన్ని పరిశీలించనున్న కేసీఆర్, లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్న అధికారులు, సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా!
వర్షప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్లు (hailstorm affected), వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు.
Hyderabad, March 23: వర్షప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్లు (hailstorm affected), వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు. ఈ సందర్భంగా నష్టపోయిన పంటల్ని స్వయంగా పరిశీలించనున్నారు. అదే విధంగా చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు. భారీ వర్షాలు కురిసిన వెంటనే సీఎం కేసీఆర్ (CM KCR)ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో కూడిన బృందం వికారాబాద్ జిల్లాల్లో పర్యటించింది. పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పారు. ఇప్పుడు స్వయంగా సీఎం కేసీఆరే క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు.
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గురువారం (23 మార్చి, 2023) నాడు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి రైతులను కలిసి పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు.
— BRS Party (@BRSparty) March 22, 2023
రాష్ట్రంలో వారం రోజులుగా వడగండ్లతో కూడిన వానలు దంచికొట్టాయి. వరి, మక్కజొన్నతోపాటు భారీస్థాయిలో ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. పంటనష్టానికి సంబంధించిన నివేదికను అధికారులు కేసీఆర్కు అందించారు. నివేదికను పరిశీలించిన సీఎం నేరుగా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే నాలుగు జిల్లాల్లో (CM KCR Tour) పర్యటించనున్నారు.
భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన కరీంనగర్ (Karimnagar) జిల్లా రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాల్లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. బాధిత రైతులను ఓదార్చనున్నారు. బుధవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు తదితర అధికారులు సీఎం పర్యటించే గ్రామాలను పరిశీలించారు. రామడుగులోని గాయత్రీ పంప్హౌస్ వద్ద ఉన్న హెలీప్యాడ్ను కూడా పరిశీలించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 23,116 ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. చొప్పదండి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో 11వేల 409 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. రామడుగు మండలంలోనే 5 వేల 825 ఎకరాలున్నాయి. ఈ 3 మండలాల్లోనే 7 వేల 695 మంది రైతులు నష్టపోతే ఒక్క రామడుగు మండలంలోనే 4 వేల 53 మంది రైతులు నష్టపోయారు. పంటనష్టం తీవ్రంగా ఉండటంతో సీఎం పర్యటనను ఇక్కడికే ఖరారు చేశారు.
వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం అడవిరంగాపురంతో పాటు పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఈ పర్యటన కోసం అడవిరంగాపురంలో హెలీప్యాడ్ సిద్ధం చేశారు. ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు.
మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు సీఎం కేసీఆర్ రానున్నారు. వడగండ్లవానతో ఇక్కడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంటలను పరిశీలించి రైతుల్లో మనోధైర్యం కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించనున్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభ్యర్థన మేరకు గురువారం ఈ తండాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు.
పంటనష్టాన్ని పరిశీలించి రైతులకు భరోసా కల్పించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లాలోని రామాపురంలో హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. రామాపురంతో పాటు గార్లపాడు, గోవిందాపురం, లక్ష్మీపురం, రావినూతల, ముష్టికుంట్ల గ్రామాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సీఎం సమీక్షించనున్నారు.
సీఎం టూర్ షెడ్యూల్
- ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డుమార్గంలో బేగంపేటకు బయలుదేరుతారు.
- 10.15 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు.
- 10.15 గంటలకు హెలిక్యాప్టర్లో బయలుదేరుతారు.
- 11.15 గంటలకు ఖమ్మం జిల్లా బొనకల్ మండలం రామాపురం గ్రామానికి చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
- 11.45 గంటలకు రామపురం గ్రామం నుంచి హెలిక్యాప్టర్లో సీఎం కేసీఆర్ బయలుదేరుతారు.
- 12.10 గంటలకు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
- 12.40కి రెడ్డికుంట తండా నుంచి హెలిక్యాప్టర్లో బయలుదేరుతారు.
- 12.55 గంటలకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకుంటారు. దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
- మధ్యాహ్నం 1.30 గంటలకు అడవిరంగాపురం గ్రామం నుంచి హెలిక్యాప్టర్లో బయలుదేరుతారు.
- 1.55 గంటలకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. రామచంద్రపూర్లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
- 2.30 గంటలకు హెలిక్యాప్టర్లో లక్ష్మీపురం గ్రామం నుంచి హైదరాబాద్కు తిరుగుప్రయాణమవుతారు.
- 3.15 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.30గంటలకు ప్రగతిభవన్కు చేరుకుంటారు.
(The above story first appeared on LatestLY on Mar 23, 2023 09:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

