CBI Arrests Kavitha: తీహార్‌ జైలులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ, కేజ్రీవాల్‌లో కలిసి కవిత కుట్రలు చేశారని సీబీఐ ఆరోపణలు
BRS Leader K Kavitha (File Image)

New Delhi, April 11: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో తీహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇప్పటి వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా తాజాగా సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు కవిత అరెస్ట్‌ను అధికారికంగా సీబీఐ ప్రకటించింది.. కోర్టుకు కూడా తెలిపింది. దీంతో అరెస్టయిన కస్టడీలో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయినట్లయ్యింది. అటు ఈడీ.. ఇటు సీబీఐ కూడా అరెస్ట్ చేయడంతో ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామమే చోటుచేసుకుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సందర్భంగా లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌లో కలిసి కవిత కుట్రలు చేశారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు కవితను అరెస్ట్‌ చేసినట్టు సీబీఐ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో, కవితను జ్యుడీషియల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌ తరలించనున్నారు. రేపు(శుక్రవారం) కోర్టు ముందు ప్రవేశపెట్టి తమ కస్టడీకి తీసుకోనున్నారు సీబీఐ అధికారులు. కవితకు కోర్టులో దక్కని ఊరట, జ్యూడీషియల్‌ రిమాండ్‌ ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు

ఇక లిక్కర్‌ స్కాం కేసులో కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవలే సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, కవిత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. ఇక, లిక్కర్‌ స్కాం కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్‌ చేసింది. ప్రస్తుతం కవిత తీహార్‌ జైలులో ఈడీ కస్టడీలో ఉన్నారు.