Telangana Assembly Elections 2023: కేసీఆర్ను గద్దె దించడానికి కాంగ్రెస్తో కలుస్తున్నాం, ఆరు అంశాలతో మద్దతు ప్రకటించిన కోదండరాం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిస్తున్నట్లు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులతో భేటీ అనంతరం ఆయన వారితో కలిసి మీడియా ముందుకు వచ్చారు.
Hyd, Oct 30: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిస్తున్నట్లు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులతో భేటీ అనంతరం ఆయన వారితో కలిసి మీడియా ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... తెలంగాణ జన సమితి తరఫున ఆరు అంశాలను కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినట్లు చెప్పారు. అలాగే నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందాలని కోరామన్నారు. కాంగ్రెస్తో కలిసి పని చేసేందుకు అంగీకారం తెలిపామన్నారు. ఉద్యమ ఆంకాంక్షలను నెరవేర్చడానికి కలిసి పని చేయాలని వారు తనను కోరారన్నారు. అందుకే నవ తెలంగాణ నిర్మాణ ప్రాతిపదికన మద్దతు తెలిపినట్లు చెప్పారు.
అందరికీ విద్య, వైద్యం అందించే ప్రభుత్వం, ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా ఆర్థిక విధాన రూపకల్పన జరగాలని, చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమల ఎదుగుదలకు చర్యలు తీసుకోవడం, సంప్రదాయ వృత్తులపై ఆధారపడినవారికి ఆదాయ భద్రత కల్పించడం, వాస్తవ సాగుదారులకు, చిన్న, సన్న, కౌలు రైతులకు ఆదాయ భద్రత, వారి భూమికి రక్షణ, రాజ్యాంగ నీతి, రాజ్యాంగ విలువల ప్రాతిపదికన ప్రజాస్వామ్య పాలన నెలకొల్పి, ఆ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్ని వర్గాల పేదలు, మైనార్టీలకు భాగస్వామ్యం, అభివృద్ధిలో వాటా దక్కేలా చర్యలు, ఉద్యమకారులకు సంక్షేమ కోసం బోర్డు, అమరవీరుల కుటుంబాలకు సమగ్ర సాయం.. ఈ అంశాలను కాంగ్రెస్ ముందు తాము ఉంచామని కోదండరాం తెలిపారు. వీటికి కాంగ్రెస్ అంగీకరించిందన్నారు.
నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయానికి సోమవారం కాంగ్రెస్ నేతలు వెళ్లారు. ఆ పార్టీ అధినేత కోదండరాంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, కర్ణాటక మంత్రి జోసురాజు, తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ కాంగ్రెస్తో కలిసి పనిచేయాల్సిందిగా కోదండరాంను కోరారు.
ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్ధుబాటు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీజేఎస్కు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఇప్పటికి కలిసి పనిచేద్దామని ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కోదండరాం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.
(The above story first appeared on LatestLY on Oct 30, 2023 04:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

