Y. S. Sharmila Meeting: అన్నని కాదని కొత్త పార్టీ పెడుతోందా? లోటస్ పాండ్‌లో వైయస్ షర్మిలారెడ్డి ఆత్మీయ సమావేశం, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పెళ్లి రోజు నేడు, జగనన్న వదిలిన బాణం ఏం చేయబోతోంది?
YS sharmila key meeting (Photo-Twitter)

Hyderabad, Feb 9: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల (Y. S. Sharmila) తెలంగాణలో కొత్త పార్టీ పెడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజుల క్రితం ఓ తెలుగు పత్రిక దీనిపై కథనాన్ని ప్రచురించడంతో దీనికి ఎనలేని బలం వచ్చింది. నేడు(ఫిబ్రవరి 9) హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఆమె తెలంగాణకు చెందిన కొందరు వైసీపీ నేతలతో ఆత్మీయ సమ్మేళనం (Y. S. Sharmila Meeting) నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 9న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ విజయమ్మ పెళ్లి రోజు ఉందని.. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగే ఆత్మీయ సమావేశానికి (YS sharmila key meeting) హాజరు కావాల్సిందిగా ఉమ్మడి నల్గొండ జిల్లా వైసీపీ శ్రేణులకు, వైఎస్ అభిమానులకు సమాచారం అందింది. దీంతో పాటు ఫిబ్రవరి 10వ తేదీన వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ పుట్టిన రోజు కూడా కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దీనిపై స్పందించిన సూర్యాపేట జిల్లా వైకాపా అధ్యక్షుడు పిట్టా రామిరెడ్డి.. మంగళవారం ఉదయం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని షర్మిల నివాసంలో ఆత్మీయ సమావేశం జరుగుతుందని తెలిపారు. 11 గంటలకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారితో షర్మిల సమావేశమవుతారని చెప్పారు. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు 150 మందితో షర్మిల సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటుపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ సమావేశానికి తెలంగాణలోని పలువురు వైసీపీ నేతలతోపాటు, దివంగత సీఎం వైఎస్సార్ అభిమానులు, ఆయన సన్నిహితులకు ఆహ్వానం పంపారు. ఇప్పటికే వైఎస్ షర్మిల సమావేశం నేపథ్యంలో భారీ ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ‘ఛలో లోటస్ పాండ్’ అంటూ సోషల్ మీడియాలో క్యాపెయినింగ్ సాగుతోంది.

చినజగ్గంపేటలో కత్తులతో దాడి చేసుకున్న ఇరువర్గాలు, ఒకరికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు, తొలి రెండు గంటల్లో 18 శాతం పోలింగ్ నమోదు, పరిస్థితిని సమీక్షిస్తున్న రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్

ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో లోటస్‌పాండ్‌ ఇంటి దగ్గర భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ షర్మిల ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే వైఎస్ జగన్ ఫొటో మాత్రం ఒక్క చోట కూడా కనిపించట్లేదు. దీంతో కొందరు అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్స్ వస్తున్నాయి.

Here's Updates

‘మన కష్టం తెలుసు.. మన కన్నీళ్లు తెలుసు.. మన బ్రతుకులు మార్చే బాట. వైయస్ఆర్ కుటుంబానికి తెలుసు. షర్మిలమ్మ నాయకత్వం వర్దిల్లాలి..!!’ అని ఫ్లెక్సీలో ఉంది. ఈ ఫ్లెక్సీలో వైఎస్సార్, షర్మిల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ‘జనంలోకి వస్తుంది షర్మిలక్క.. జనరంజకపాలన ముందుందిక’ అని మరో ఫ్లెక్సీలో ఉంది. ఇందులో కూడా షర్మిల ఫొటో మాత్రమే ఉంది కానీ జగన్ ఫొటో లేదు. ఇలా పెద్ద ఎత్తున వెలిసిన ఫ్లెక్సీల్లో ఒక్క చోట కూడా వైఎస్ జగన్ ఫొటో లేకపోవడం గమనార్హం. మరోవైపు వైఎస్ అభిమానులు, అనుచరులు మీడియాతో మాట్లాడుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

ఉత్కంఠలో నిమ్మాడ పంచాయితీ, ప్రారంభమైన పంచాయితీ ఎన్నికల పోలింగ్,  2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్, బరిలో 43,601 మంది అభ్యర్థులు

ఇదిలా ఉంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో నేరుగా వైఎస్ షర్మిల పేరును ప్రస్తావించకుండా మాట్లాడారు. కొత్త పార్టీని పెట్టడం అంత ఈజీనా? ఒక పార్టీని పెట్టడానికి ఎంతో శ్రమ కావాలని చెప్పారు. గతంలో విజయశాంతి, దేవేందర్ గౌడ్, నరేంద్ర వంటి వారు పార్టీలు పెట్టారు. ఆ పార్టీలు మట్టిలో కలిసిపోలేదా? అని అన్నారు. ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు రాలేదు? ఎన్ని పార్టీలు పోలేదు? ఇప్పుడు కొత్తగా మరో పార్టీ వచ్చినా… నాలుగు రోజుల్లో తోక ముడుస్తారని అన్నారు. కొత్త పార్టీల నేతలు తెరమరుగైపోతారని చెప్పారు. తెలంగాణలో టీడీపీ తర్వాత నిలదొక్కుకున్న ఏకైక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు.

ఇక సబ్బం హరి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైఎస్ ఫ్యామిలీపై బాంబు పేల్చారు. గత కొంతకాలంగా షర్మిల సొంత పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా సబ్బం హరి తాజా వ్యాఖ్యలున్నాయి. జగన్ జైలులో ఉన్నప్పుడే ఈ విష బీజాలు వారి మధ్యలో నాటుకున్నాయని సబ్బం హరి చెప్పుకొచ్చారు. షర్మిల, అనిల్ ఇప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ చేయించారని, ముహూర్తాలు, జాతకాలు కూడా చూపించుకుంటున్నారని హరి చెప్పుకొచ్చారు.

షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాలు చేయనున్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ వి హనుమంతరావు కూడా స్పందించారు. ఓ ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై వీహెచ్ స్పందించారు. షర్మిలకు విశాఖ ఎంపీ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు. షర్మిల పార్టీ పెట్టాలని భావిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టడం మేలని ఆయన వ్యాఖ్యనించారు. తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని జోస్యం చెప్పారు. జగన్‌పై ప్రతీకారం తీర్చుకోవాంటే షర్మిల ఏపీలో పార్టీ పెట్టాలని సూచించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి తానొక్కడినే వారసుడిగా జగన్ భావిస్తున్నారని వీహెచ్ అభిప్రాయపడ్డారు. షర్మిలలో కూడా ప్రవహిస్తున్నది వైఎస్ రక్తమేనని.. అందుకే ఆమె పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

అయితే.. షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ గతంలో ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని షర్మిల కొట్టిపారేశారు. ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పని షర్మిల మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు రాసిన పత్రిక, చానెల్ మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి తాను వెనకాడబోనని వైఎస్ షర్మిల హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం షర్మిల ఓ ప్రకటన విడుదల చేశారు.

క్రిస్మస్ సందర్భంగా జరిగిన వేడుకల్లో సీఎం జగన్, ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ సహా పలువురు సన్నిహితులు పాల్గొన్నారు. అయితే ఇందుల్లో షర్మిల, ఆమె భర్త అనిల్ మాత్రం కనిపించలేదు. దీంతో వైఎస్ జగన్, షర్మిల మధ్య గ్యాప్ వచ్చిందనే ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. అయితే ఈసారి ఆమె రాకపోవడానికి కారణం ఆమె కుమారుడే అనే ప్రచారం కూడా ఉంది. అమెరికాలోని తన కుమారుడి దగ్గరకు వెళ్లడంతోనే ఆమె క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారని కొందరు దగ్గరి నేతలు తెలిపారు.

ఈ ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరనున్న షర్మిల, ఉదయం 10 గంటల తరువాత హైదరాబాద్, లోటస్ పాండ్ కు చేరుకుని, అభిమానులను ఉద్దేశించి మాట్లాడనున్నారని సమాచారం. ఇవి కేవలం ఆత్మీయ సమావేశాలేనని షర్మిల వర్గం చెబుతున్నా, కొన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాగా, టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీల్లో క్రియాశీలకంగా లేని నేతలను షర్మిల వర్గం గత వారం రోజులుగా సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.

నేడు దాదాపు 150 మందితో షర్మిల సమావేశం అవుతున్నారని తెలుస్తుండగా, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురికి కూడా ఫోన్లు వెళ్లాయి. అభిమానుల నుంచి తొలుత రాజకీయ రంగ ప్రవేశంపై అభిప్రాయాలను షర్మిల కోరతారని, ఆ తరువాతే తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

మరో ప్రజా ప్రస్థానం షర్మిల రాజకీయ జీవితం ఇదే

వైయస్ జగన్ సోదరి షర్మిల ఇప్పటి ఏపీ సీఎం అక్రమాస్తుల కేసుల ఆరోపణలపై జైలులో ఉన్నప్పుడు పాదయాత్ర నిర్వహించారు. 2012 - 2013 సంవత్సరాల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా మరో ప్రజా ప్రస్థానం" పేరుతో వైసీపీ పార్టీని జనాలకు చేరువ చేశారు.

వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున తల్లి విజయమ్మతో పాటు జూన్12, 2012 న జరిగిన ఉపఎన్నికలలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తూ తొలిసారిగా ప్రజాజీవితంలోకి అధికారికంగా వచ్చారు. జూన్ నెలలో జగనును అరెస్టుచెయ్యగా, ఉప ఎన్నిక ప్రచారానికై జగన్ పార్టీ అభ్యర్థికొండ సురేఖ తరుపున ఆమె ప్రచారములో పాల్గొనటంద్వారా ఆమె ప్రత్యక్షరాజకీయ జీవితం మొదలైనది. అంతకుముందు ఆమె, అనేక క్రిస్టియను మతప్రచారసభలలో పాల్గొని ప్రసంగించిన అనుభవమున్నది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త పాదయాత్ర నిర్వహించింది

జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమఆస్తులను కలిగివున్నాడనే ఆరోపణమేరకు సి.బి.ఐ.వాళ్లు అయనను ఉపఎన్నికలముందే అరెస్టు చేసారు.ఈ నేపథ్యంలో పార్టిని మరింత ప్రజలకు చేరువగా తీసుకెళ్లి ప్రయత్నంగా, పార్టీ శ్రేణుల్లో ఉత్యాహం నింపి బలోపేతంచేయు దిశగా మరో ప్రజా ప్రస్థాపన పేరు మీద పాదయాత్రను18 అక్టొబరు2012న ప్రారంభించారు.

మొత్తం 16 జిల్లాల్లో దాదాపు 3,112 కి.మీ పాదయాత్ర జరిపింది. ఇంత దూరం పాదయాత్ర జరిపిన మొట్టమొదటి మహిళ షర్మిలా గుర్తింపు గడించారు. తనతండ్రి దివంగత రాజశేఖరురెడ్డి సమాధి (ఇడుపుల పాయ) నుండి ప్రారంభమైన పాదయాత్ర  శ్రీకాళం జిల్లాలో ఇచ్చాపురంలో ముగిసింది. 8 నెలలు సాగిన పాదయాత్రలో 14 జిల్లాల్లో 116 నియాజకవర్గాల మీదుగా సాగింది.ఇందులో 9 కార్ఫోరేషన్లు, 45 మున్సిపాలిటిలు, 195 మండలాలు ఉన్నాయి.ఈ యాత్ర 2250 గ్రామాలను తాకుతూ సాగింది.మొత్తం యాత్రలో 190 గ్రామ ప్రాంతాలలో రచ్చబండను నిర్వహించడం జరిగింది. 152 ప్రదేశాలలల్ఫో బారీ స్థాయిగా జరిగిన జనసభలలో ప్రసంగించడం జరిగింది. ఈ పాదయాత్రలో దాదాపు కోటిమందికి పైగా జనాలను షర్మిలా ప్రత్యక్ష్యంగా కలిసినట్లు అంచనా వేసారు.

పాదయాత్రలో షర్మిలకు డిసెంబరు17 న గాయం అగుటవలన తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేసింది.అమె కాలికి అపోలో ఆస్పత్రిలో ఆపరేషను చేసి, ఆరువారాలపాటు విశ్రాంతి తీసుకొనవలసినదిగా సలహానిచ్చారు. రికవరీ అయిన తరువాత తిరిగి మళ్లీ ఫిబ్రవరి 6,2013 నుండి మళ్ళి పాదయాత్ర ఆరంభించింది.

ఇచ్ఛాపురంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో తను ప్రతి పక్షసభ్యుడుగా వున్నప్పుడు చేవెల్ల నుండి పాదయాత్రచేపట్టి 68 రోజులపాదయాత్రచేసి,1,473 కి.మీ ఇచ్ఛాపురం వరకు నడచి, పాదయాత్ర ముగించిన సందర్భంగా అక్కడ నిర్మించిన విజయవాటిక స్మారక స్తూపానికి ఎదురుగనే షర్మిలా మరో ప్రజాప్రస్థానం ముగింపు చిహ్నం విజయ ప్రస్థానం నిర్మించి, ఆవిష్కారం చేసారు.

షర్మిలా పాదయాత్ర జరిపిన జిల్లాలు :1.వైస్సార్,2.అనంతపురం,3.కర్నూలు, 4.మహబూబ్ నగర్,5.రంగారెడ్డి, 6.నల్లగొండ, 7.గుంటూరు,8. కృష్ణా.9.ఖమ్మం, 10.పశ్చిమ గోడావరి, 11.తూర్పు గోదావరి, 12.విశాఖపట్నం, 13.విజయనగరం, 14.శ్రీకాళం.

ఇప్పుడు జరుగుతున్న ఆత్మీయ సమావేశంలో కొత్త పార్టీపై కార్యకర్తలతో షర్మిల దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి ఆంధ్ర ముద్ర ఉంది కాబట్టి తెలంగాణలో కొత్త పార్టీ స్థాపిస్తారా..? లేకుంటే ఇక్కడ కూడా వైసీపీతోనే ముందుకెళ్తారా..? అనే విషయంపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది.