TRAI New Rules: ఫోన్‌లో స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? TRAI కొత్త రూల్స్ ఇవే.. రోబోకాల్స్ చేస్తే 5 పైసలు చొప్పున ఛార్జ్..

మొబైల్ ఫోన్ వినియోగదారులను వేధించే అవాంఛిత వాణిజ్య పిలుపులు, సందేశాలు (స్పామ్ కాల్స్ & ఎస్ఎంఎస్‌లు) అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘టెలికాం వాణిజ్య కమ్యూనికేషన్ల కస్టమర్ ప్రాధాన్యత నిబంధనలు, 2018’కి కీలక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

Spam Calls (photo-ANI)

TRAI New Rules: మొబైల్ ఫోన్ వినియోగదారులను వేధించే అవాంఛిత వాణిజ్య పిలుపులు, సందేశాలు (స్పామ్ కాల్స్ & ఎస్ఎంఎస్‌లు) అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘టెలికాం వాణిజ్య కమ్యూనికేషన్ల కస్టమర్ ప్రాధాన్యత నిబంధనలు, 2018’కి కీలక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత, రోబో కాల్స్‌పై అదనపు ఛార్జీలు మరియు దుర్వినియోగానికి పాల్పడే టెలిమార్కెటర్లపై ఏడాది పాటు నిషేధం వంటి కఠినమైన నిబంధనలను నూతన ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చింది.

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం ఏదైనా నంబర్‌పై చర్యలు తీసుకోవాలంటే 10 రోజుల్లో కనీసం ఐదు ప్రత్యేక ఫిర్యాదులు రావలసి ఉండేది. అయితే నూతన సవరణల ప్రకారం, టెలికాం ఆపరేటర్ల AI/ML (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వ్యవస్థ సదరు నంబర్‌ను అనుమానిత స్పామ్‌గా గుర్తిస్తే, కేవలం మూడు ఫిర్యాదులు వచ్చినా తక్షణమే విచారణ ప్రారంభమవుతుంది. నిబంధనలు ఉల్లంఘించినవారి కేవైసీ (KYC) పునఃధృవీకరణ, అవుట్‌గోయింగ్ సేవల నిలిపివేతతో పాటు అవసరమైతే కనెక్షన్లను పూర్తిగా రద్దు చేసే అధికారాన్ని ఆపరేటర్లకు కల్పించారు.

టాటా సన్స్ బోర్డు కీలక నిర్ణయం..మరో 5 ఏళ్ల పాటు చంద్రశేఖరన్ కొనసాగింపునకు గ్రీన్ సిగ్నల్..

అనుమతి లేని ఆటోడైలింగ్, రోబోకాల్స్, రికార్డెడ్ వాయిస్ కాల్స్ చేసే సంస్థలపై ట్రాయ్ ఉక్కుపాదం మోపనుంది. ఇలాంటి అప్లికేషన్-టు-పర్సన్ (A2P) కాల్స్ చేసే సంస్థలు ముందస్తుగా టెలికాం కంపెనీలకు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. ముందస్తు ప్రకటన లేకుండా చేసే ఆటోమేటెడ్ కాల్స్‌ను నిరోధించడమే కాకుండా, వాటికి నిమిషానికి ₹0.05 టెర్మినేషన్ ఛార్జీ విధించనున్నారు.

కస్టమర్లు ఏదైనా సేవ లేదా ఉత్పత్తుల గురించి డిజిటల్ లేదా రాతపూర్వకంగా విచారించినప్పుడు, ఆ వివరాల ఆధారంగా సదరు వ్యాపార సంస్థలు కస్టమర్‌ను సంప్రదించడానికి ఏడు రోజుల వ్యవధిని మాత్రమే అనుమతించారు. ఆ విచారణ రికార్డులను ఆధారాలుగా భద్రపరచుకోవాల్సిన బాధ్యత సదరు సంస్థలపైనే ఉంటుంది.

కాల్స్ కోసం ఉపయోగించే హెడర్‌లు లేదా టెంప్లేట్‌లు దుర్వినియోగమైనట్లు తెలిస్తే, ఆరు గంటల్లోగా వాటిని డిసీజ్ చేయాలి. ఏదైనా టెలిమార్కెటింగ్ సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్ చేయడంతో పాటు దేశంలోని అన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో ఒక సంవత్సరం పాటు సేవలను నిలిపివేస్తారు. వినియోగదారుల హక్కులను కాపాడటం, సాంకేతికత ఆధారంగా స్పామ్‌ను అరికట్టడం మరియు టెలిమార్కెటర్లలో జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు ట్రాయ్ స్పష్టం చేసింది.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement