Virus (Image Credits: Pixabay)

Beijing, FEB 21: చైనా(China)లో కొవిడ్‌ మాదిరిగా ఉన్న కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌ను ‘హెచ్‌కెయూ5- కోవ్‌-2’గా పేర్కొన్నారు. ఇది కొవిడ్‌ 19కి కారణమైన SARS-CoV-2ను పోలి ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు హాంకాంగ్‌కు చెందిన ‘సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌’ పత్రిక తన కథనంలో పేర్కొంది. గబ్బిలాల్లో కరోనా వైరస్‌లపై విస్తృత పరిశోధనలు చేసి ‘బ్యాట్ ఉమెన్‌’గా పేరొందిన ప్రఖ్యాత వైరాలజిస్టు షీ ఝెంగ్‌లీ ఈ పరిశోధనా బృందానికి సారథ్యం వహించారు. ఇందులో గాంఘ్జౌ లేబోరేటరీ, గాంఘ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ విశ్వవిద్యాలయంతో పాటు వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి చెందిన శాస్త్రవేత్తలు భాగస్వాములుగా ఉన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన పరిశోధనా పత్రం ‘సెల్‌’ జర్నల్‌లో సమీక్షకు ఉంచినట్లు కథనంలో పేర్కొన్నారు.

Catch Mosquitoes and Win Cash: ఫిలీప్పీన్స్‌లో దోమల నియంత్రణకు అదిరే ఆఫర్.. ఐదు దోమలు పట్టుకుంటే నగదు బహుమతి, వైరల్‌గా మారిన న్యూస్  

ఈ వైరస్‌ మెర్బెకోవైరస్‌తోపాటు ప్రాణాంతక మెర్స్‌-కోవ్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) ఉప రకానికి చెందినదిగా పరిశోధకులు గుర్తించారు. ఇది హెచ్‌కేయూ5 కరోనా వైరస్‌ సంతతికి చెందినదిగా పేర్కొన్నారు. ఈ వైరస్‌ను తొలుత హాంకాంగ్‌లోని జపనీస్‌ పిపిస్ట్రెల్‌ రకం గబ్బిలాల్లో గుర్తించారు. తాజా పరిశోధన ప్రకారం.. HKU5-CoV-2 నేరుగా లేదా మాధ్యమజీవుల ద్వారా మనుషులకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ సామర్థ్యం కొవిడ్‌-19తో పోలిస్తే తక్కువేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.