Crude Oil Prices: అమెరికా–ఇరాన్ శాంతి చర్చలపై అనిశ్చితి.. మళ్లీ పెరుగుతున్న ముడిచమురు ధరలు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మళ్లీ తెరపైకి..
అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలపై స్పష్టత లేకపోవడంతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు మరోసారి పెరుగుతున్నాయి. సరఫరా అంతరాయాలపై ఆందోళనలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 94 డాలర్లకు చేరువలో ట్రేడవుతోంది.
Crude Oil Prices: ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర ఇంధన మార్గం హార్ముజ్ జలసంధి తిరిగి ప్రారంభించడంపై ఐరోపా, ఆసియా మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఒమన్తో నూతన నౌకా మార్గాల ఏర్పాటుపై చర్చలు దాదాపు ముగింపు దశకు వచ్చినప్పటికీ.. అమెరికా అదనపు షరతులను నెరవేర్చాల్సి ఉందంటూ ఇరాన్ స్పష్టం చేయడంతో ఆసియా, ఐరోపా ట్రేడింగ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దౌత్యపరమైన చిక్కుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి.
గత వారంలో జలసంధి తెరవడంపై సానుకూల వార్తలు రావడంతో చమురు ధరలు దాదాపు 7 శాతం మేర పడిపోయినప్పటికీ.. తాజా పరిణామాలతో ట్రేడర్లు మళ్లీ ముందస్తు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 91 సెంట్లు (1.09%) పుంజుకుని 84.46 డాలర్ల వద్దకు చేరగా.. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 61 సెంట్లు (0.78%) పెరిగి బ్యారెల్కు 78.79 డాలర్లు దాటింది.
హార్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన ప్రయాణానికి వీలుగా ఒమన్తో కొత్త నౌకా మార్గం ఏర్పాటుపై ఒప్పందం చాలా దగ్గరగా ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. అయితే గత జూన్లో కుదిరిన మధ్యంతర శాంతి ఒప్పందాన్ని వాషింగ్టన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికాతో ప్రత్యక్షంగా మాట్లాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒప్పందం పూర్తయినా, అది తక్షణమే నౌకల రాకపోకలను పునరుద్ధరించడానికి తోడ్పడదని ఆయన హెచ్చరించడం సరఫరా స్థిరపడుతుందని భావించిన వ్యాపారులను నిరాశపరిచింది.
జలసంధి పూర్తిగా తెరవాలంటే అమెరికా తమపై విధించిన నావికా దిగ్బంధనాన్ని తక్షణమే తొలగించాలని.. ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను రద్దు చేయాలని, అలాగే ఇటీవల సంభవించిన సైనిక ఘర్షణల వల్ల వాటిల్లిన నష్టానికి తగిన పరిహారాన్ని చెల్లించాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితిపై కొంత మృదువైన ధోరణిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. వాషింగ్టన్ ఈ వివాదాన్ని తక్కువ చేసి చూపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రమైన సైనిక చర్యల బెదిరింపుల అనంతరం ఉద్రిక్తతలను తగ్గించే దిశగా మాట్లాడటం గమనార్హం. అమెరికా సెంట్రల్ కమాండ్ దక్షిణం వైపు ఉన్న మార్గం వాణిజ్య నౌకలకు తెరిచే ఉందనే సంకేతాలు ఇచ్చినప్పటికీ, టెహ్రాన్ ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చింది.
ప్రాంతీయ ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో నౌకా రవాణా దిగ్గజాలు తీవ్ర కలవరానికి గురవుతున్నాయి. యెమెన్లోని హౌతీ మిలిటెంట్లు సౌదీ అరేబియాలోని కీలకమైన జాజాన్ రిఫైనరీపై దాడి చేపట్టినట్లు ప్రకటించారు. అలాగే వారాంతంలో హోర్ముజ్ జలసంధి సమీపంలో అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన చమురు ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం భద్రతా భయాలను రెట్టింపు చేసింది.
సాధారణ రోజుల్లో ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదవ వంతు (20%) ఈ హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. చైనా, భారత్ సహా పలు ఆసియా దేశాలకు ఇంధన దిగుమతులకు ఈ మార్గం అత్యంత కీలకం. ఒప్పందంపై సంతకాలు జరిగినా పూర్తిస్థాయిలో నౌకల రాకపోకలు ప్రారంభం కావడానికి సమయం పడుతుందన్న విశ్లేషణలతో, రాబోయే రోజుల్లోనూ ముడి చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.