Iran Under Watch? ఇరాన్ పనిని త్వరలోనే ముగిస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. యుద్ధానికి రెడీగా ఉండాలని అమెరికా సైనిక దళాలకు పిలుపు..

హర్మూజ్ జలసంధి వంటి కీలక ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో పాటు అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అనిశ్చితితో ఉన్న ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ ఘర్షణ మరింత ముదిరితే అది ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచవ్యాప్త సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందనే ఆందోళనలు పెరుగుతున్నాయి.

Donald Trump (Photo- AFP)

Iran Under Watch? అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన, సైనిక ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. ఇరాన్‌లో జరుగుతున్న ప్రతి కదలికపై అమెరికా నిఘా వ్యవస్థ నిశితంగా నిఘా ఉంచుతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే ఇరాన్‌పై మరోసారి ప్రతిఘటన దాడులకు దిగేందుకు అమెరికా సైనిక దళాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

శ్వేతసౌధంలోని ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ప్రస్తుతం కొనసాగుతున్న సైనిక ఘర్షణ ఎక్కువ కాలం కొనసాగబోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్ అంతర్గత పరిణామాలు, సైనిక కదలికలపై అమెరికాకు సమగ్ర సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా నిఘా సామర్థ్యాన్ని వివరిస్తూ.. ఇరాన్‌లో వారు చేసే ప్రతి కదలిక తమకు తెలిసిపోతుందనే అర్థంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మైనర్ పిల్లల US వీసాపై కీలక అప్‌డేట్.. తల్లిదండ్రులకు ఎంబసీ వార్నింగ్.. ఈ తప్పు చేయొద్దని సూచన

మధ్యప్రాచ్య ప్రాంతంలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై కూడా అమెరికా ప్రత్యేక దృష్టి సారించినట్లు ట్రంప్ వెల్లడించారు. ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ జలసంధిలో ఇరాన్ చేపడుతున్న చర్యలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. ఇరాన్ ఏర్పాటు చేస్తున్న రాడార్ వ్యవస్థలు, క్షిపణి స్థావరాలను గుర్తించామని ఆయన పేర్కొన్నారు.

సముద్ర మార్గాల్లో మైన్లను ఏర్పాటు చేసేందుకు ఇరాన్ సిద్ధం చేసిన రాకెట్ వ్యవస్థను అమెరికా దాడుల్లో ధ్వంసం చేసినట్లు కూడా ట్రంప్ వెల్లడించారు. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే ప్రపంచ వాణిజ్యం, ముఖ్యంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై అమెరికా జరిపిన తాజా దాడుల్లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 108 మంది గాయపడినట్లు ఇరాన్ వర్గాలు ఆరోపించాయి. హర్మూజ్ సమీపంలోని కుహెస్తాక్ ప్రాంతంలో వివాహ వేడుక జరుగుతున్న ప్రదేశంపై కూడా దాడులు జరిగాయని టెహ్రాన్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలపై అమెరికా నుంచి పూర్తి స్థాయి స్పందన రావాల్సి ఉంది.

అమెరికా దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగినట్లు సమాచారం. కువైట్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్‌తో పాటు ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణి, డ్రోన్ దాడులను తమ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ ప్రకటించింది. దీంతో మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాల భద్రతపై మరింత అప్రమత్తత పెంచినట్లు తెలుస్తోంది.

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్య దేశాల్లో ఆందోళన నెలకొంది. ఇరు దేశాలు పరస్పరం ప్రతీకార దాడులకు దిగితే ఈ ఘర్షణ ఇతర దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement