
సూడాన్ (Sudan)లో ఘోర విమాన ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 46కు పెరిగింది. సయిద్నా ఎయిర్ బెస్ (Wadi Seidna Air Base) నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ టేకాఫ్ అవుతుండగా..గాల్లోకి ఎగిరిన కాసేపటికే నివాస ప్రాంతంలో కూలిపోయింది. మృతుల్లో ఆర్మీ అధికారులతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు తెలిసింది.ఈ విషాదకర ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సూడాన్ మీడియా పేర్కొంటోంది. రంగంలోకి దిగిన అధికారులు ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ఇక అమెరికాలో మిడ్డే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Midway International Airport)లో రెండు విమానాలు దాదాపు ఢీ కొనబోయాయి. అయితే పైలట్ అప్రమత్తతతో తృటిలో ప్రమాదం తప్పినట్లైంది. మంగళవారం ఉదయం 8:50 గంటల సమయంలో సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ (Southwest Airlines)కు చెందిన విమానం (2504) ఒమాహా నుంచి చికాగో మిడ్వే ఎయిర్పోర్ట్కు చేరుకుంది. రన్వేపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. విమాన చక్రాలు కూడా రన్వేకి తాకాయి. ఇక అదే సమయంలో రన్వేపై ఓ ప్రైవేట్ జెట్ (private jet) ఉన్నట్టుండి విమానానికి అడ్డంగా వచ్చింది. దీన్ని గమనించిన సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని టేకాఫ్ తీసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.