Soumya Swaminathan: రెండు కంపెనీల వ్యాక్సిన్లు తీసుకోవద్దు, వ్యాక్సిన్ మిక్సింగ్ చాలా ప్రమాదకరమని తెలిపిన డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్, పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని హెచ్చరిక
వ్యాక్సిన్ మిక్సింగ్ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ (WHO's Chief Scientist Soumya Swaminathan) వార్నింగ్ ఇచ్చారు. వ్యాక్సిన్ మిక్సింగ్ అనేది ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందని తెలిపారు.
Geneva, July 13: వ్యాక్సిన్ మిక్సింగ్ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ (WHO's Chief Scientist Soumya Swaminathan) వార్నింగ్ ఇచ్చారు. వ్యాక్సిన్ మిక్సింగ్ అనేది ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుందని తెలిపారు. వ్యక్తిగతంగా ఎవరూ తమకు నచ్చిన రీతిలో కరోనా వ్యాక్సిన్లు (Mixing and Matching COVID-19 Vaccines) తీసుకోవద్దని, ప్రజా ఆరోగ్య వ్యవస్థలు సూచించిన టీకాలను మాత్రమే వేసుకోవాలని ఆమె చెప్పారు. జెనీవా నుంచి ఆన్లైన్లో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనా వ్యాక్సిన్లను మిక్స్ చేయడం వల్ల కానీ, మ్యాచింగ్ చేయడం వల్లే కలిగే పరిణామాలపై ఇంకా ఎటువంటి డేటా అందుబాటులో లేదని ఆమె వెల్లడించారు. ఈ అంశంపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయని, డేటా కోసం ఎదురుచూస్తున్నామన్నారు. వ్యాక్సిన్ మిక్సింగ్ వల్ల కలిగే రోగనిరోధక శక్తి, రక్షణ అంశాలను ఇంకా పరిశీలించాల్సి ఉందన్నారు. ఒకవేళ ప్రజలే ఆరోగ్య సంస్థల ప్రమేయం లేకుండా తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటే… అప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే ఈ మధ్య సింగిల్ డోసు జాన్సెన్ టీకా తీసుకున్న వారు .. బూస్టర్ డోసు రూపంలో మరో కంపెనీ టీకాను వేయించుకోవచ్చు అని ఇటీవల శాస్త్రవేత్త ఏంజిలా రాస్మూసెన్ తెలిపిన సంగతి విదితమే. జాన్సెన్ టీకా తీసుకున్న వారు.. ఫైజర్ లేదా మోడెర్నాకు చెందిన ఎంఆర్ఎన్ఏ టీకాను వేసుకోవాలని..అత్యంత ప్రమాదకరంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ను ఎదుర్కొనేందుకు ఇదే కీలకమని పరిశోధకురాలు ఏంజిలా రాస్మూసెన్ తెలిపారు. తాను ఏప్రిల్లో జాన్సెన్ టీకా తీసుకున్నానని మళ్లీ ఫైజర్ టీకా బూస్టర్గా వేసుకున్నట్లు చెప్పారు. జాన్సెన్ తీసుకున్నవారంతా నాలాగే బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. ఇదే కాదు.. బూస్టర్ డోసు రూపంలో మూడవ ఫైజర్ డోసు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆమె ప్రభుత్వాలను అభ్యర్థించారు.
Here's Reuters Update
ఈ శాస్త్రవేత్త తెలిపిన విషయాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. డబ్ల్యూహెచ్వో తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ మిక్సింగ్, మ్యాచింగ్ సరికాదని హెచ్చరికలు జారీ చేసింది. కాగా బూస్టర్ డోసులను పేద దేశాలకు తరలించాలని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ ధనిక దేశాలను కోరారు.