EPFO 3.0 Update: PF డబ్బు ATM నుంచి తీసుకోవచ్చా? UPI విత్డ్రాపై అసలు నిజం ఇదే
భారత ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) జీతభత్యాలు పొందే ఉద్యోగుల కోసం అత్యంత కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది.
EPFO 3.0 Update: భారత ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) జీతభత్యాలు పొందే ఉద్యోగుల కోసం అత్యంత కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించుకోవడానికి వారాల తరబడి వేచి చూడటం, సంక్లిష్టమైన ఫారాలు పూర్తి చేయడం వంటి ఇబ్బందులకు స్వస్తి పలుకుతూ త్వరలోనే "EPFO 3.0" అనే కొత్త సాంకేతిక వ్యవస్థను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ అధునాతన అప్గ్రేడ్తో పీఎఫ్ ఖాతా నిర్వహణ సాధారణ పొదుపు బ్యాంక్ ఖాతా వలె అత్యంత సులభతరం కానుంది.
ప్రస్తుతం వేర్వేరు ప్రాంతీయ కార్యాలయాల సర్వర్లలో సమాచారం ఉండటం వల్ల తరచూ వెబ్సైట్ హ్యాంగ్ కావడం, క్లెయిమ్లు ఆలస్యం కావడం జరుగుతోంది. దీనికి పరిష్కారంగా "EPFO 3.0"ని పూర్తిగా క్లౌడ్-ఆధారిత కేంద్రీకృత వ్యవస్థగా రూపుదిద్దారు. దీనివల్ల సాంకేతిక సమస్యలు తొలగిపోయి సేవలు అత్యంత వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త విధానంలో అనారోగ్యం, వివాహం లేదా సొంతింటి కొనుగోలు వంటి అత్యవసర అవసరాల కోసం చేసుకునే రూ. 5 లక్షల వరకు ఉండే అడ్వాన్స్ క్లెయిమ్లు ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతాయి. దరఖాస్తులను పరిశీలించడానికి అధికారుల ప్రమేయం లేకుండా, కంప్యూటర్ సిస్టమే వివరాలను ధృవీకరించి కేవలం 3 నుంచి 4 రోజులలోపు సొమ్మును నేరుగా ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పీఎఫ్ వ్యవస్థలను ఆధునిక బ్యాంకింగ్ నెట్వర్క్ మరియు యూపీఐతో అనుసంధానించాలని ఈపీఎఫ్ఓ యోచిస్తోంది. అత్యవసర వైద్య ఖర్చుల కోసం చిన్న మొత్తాలను ఉపసంహరించుకునేందుకు ఉద్యోగులకు ఏటీఎంలు మరియు యూపీఐ యాప్ల ద్వారా నేరుగా విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా ఉంది. ఈ సాంకేతిక అప్గ్రేడ్ను సెప్టెంబర్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతుండగా, దీనిపై ఈపీఎఫ్ఓ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.