Rajya Sabha Passes 2 Farm Bills: విపక్షాల నిరసనల మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం, బిల్లు ముసాయిదా ప్రతులను చించేసిన విపక్ష ఎంపీలు
Agricultural Reform Bills Moved To Rajya Sabha Amid Protests (Photo-ANI)

New Delhi, September 20: విపక్షాల నిరసనల మధ్య రెండు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం (Farm Bill 2020 Passed) తెలిపింది. బిల్లులపై మూజువాణి ఓటుతో బిల్లులకు పెద్దల సభ ఆమోదం తెలిపింది. రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపడతామని, వ్యవసాయ సంస్కరణల ఫలితంగా దేశవ్యాప్తంగా రైతుల ఉత్పత్తులు పెరుగుతాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ బిల్లులపై చర్చ సందర్భంగా పేర్కొన్నారు.

మంత్రి వ్యాఖ్యలను విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో సభలో పెను దుమారం రేగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. బిల్లు ప్రతులను పలువురు సభ్యులు చించివేశారు.

వెంటనే వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. వ్యవసాయ బిల్లులను సభ ఆమోదించిందని (Rajya Sabha Passes 2 Farm Bills ) డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు. అంతకుముందు రాజ్యసభలో బిల్లు ఓటింగ్‌ను అడ్డుకునేందుకు విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేశాయి.

వ్యవసాయ బిల్లులకు వైసీపీ మద్దతు, రైతులు ముందుగానే ధర నిర్ణయించుకునే అవకాశం, మార్కెట్ కమిటీల నియంతృత్వానికి తెరపడుతుందని తెలిపిన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి

డిప్యూటీ చైర్మన్‌ పోడియం చుట్టూ చేరి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు తృణమూల్‌ కాం‍గ్రెస్‌కు చెందిన ఎంపీ డెరెక్‌ ఓ బ్రెయిన్‌‌ బిల్లు మాసాయిదా ప్రతులు చింపి.. పోడియంపై విసిరారు.

రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల దుమారం, అడ్డుకున్న విపక్షాలు, రైతులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మారుస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శలు

టీఎంసీ, ఆమ్‌ఆద్మీ, శిరోమణీ అకాలీదళ్‌ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని మైకు‌లు విరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో రాజ్యసభలో విపక్షాల తీరు తీవ్ర గందగోళానికి దారితీసింది. కాగా లోక్‌సభలో వ్యవసాయ బిల్లులు గురువారం రాత్రి ఆమోదం పొందాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ బిల్లులకు నిరసనగా పంజాబ్‌, హరియాణ సహా పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళనలు చేపట్టారు