Bengaluru Hotel Horror: భార్య అక్రమ సంబంధం అనుమానం.. ఇద్దరు కూతుర్లను దారుణంగా చంపిన తండ్రి.. ఆపై ఆత్మహత్యాయత్నం.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు..
పిల్లల సంరక్షణ (కస్టడీ) హక్కును తనకు అప్పగించేందుకు భార్య, కుటుంబ సభ్యులు నిరాకరించారనే కోపంతో.. ఒక తండ్రి తన ఇద్దరు మైనర్ కుమార్తెలను అతి దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం బెంగళూరులో వెలుగుచూసింది.
Bengaluru Hotel Horror: పిల్లల సంరక్షణ (కస్టడీ) హక్కును తనకు అప్పగించేందుకు భార్య, కుటుంబ సభ్యులు నిరాకరించారనే కోపంతో.. ఒక తండ్రి తన ఇద్దరు మైనర్ కుమార్తెలను అతి దారుణంగా హత్య చేసిన ఘోర ఉదంతం బెంగళూరులో వెలుగుచూసింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒక ప్రముఖ ఫైవ్స్టార్ హోటల్లో ఈ నివ్వెరపరిచే ఘటన చోటుచేసుకుంది.
ఈశాన్య బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) జీకే మిథున్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఎస్.జి. ఇమ్రాన్ (45) ఆదివారం రాత్రి సుమారు 7.30 గంటలకు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హోటల్లో చెక్-ఇన్ అయ్యాడు. అర్ధరాత్రి దుబాయ్ నుంచి ఒక అతిథి వస్తారని సిబ్బందికి తెలిపాడు. అయితే సోమవారం మధ్యాహ్నం వరకు చెక్-అవుట్ చేయకపోవడంతో హౌస్ కీపింగ్ సిబ్బంది తలుపు తట్టగా స్పందన రాలేదు.
సాయంత్రం 5.30 గంటల సమయంలో హోటల్ మేనేజర్ డూప్లికేట్ తాళంచెవితో తలుపులు తెరవగా.. నాలుగో అంతస్తు గదిలోని మంచం వద్ద 5 ఏళ్ల షేక్ జెహరా, 10 ఏళ్ల షేక్ జోయా విగతజీవులుగా పడి ఉన్నారు. అదే గదిలో తీవ్ర గాయాలతో ఉన్న ఇమ్రాన్ను పోలీసులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఫరవాలేదని వైద్యులు తెలిపారు. పోలీసుల విచారణలో తన ఇద్దరు కుమార్తెలను గొంతు నులిమి హత్య చేసినట్లు ఇమ్రాన్ అంగీకరించాడు. ఘటన స్థలంలో ఒక లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ లేఖలో ఇమ్రాన్ తన భార్యతో ఉన్న వైవాహిక వివాదాలను, ఆమె వివాహేతర సంబంధం కలిగి ఉందనే ఆరోపణలను ప్రస్తావించాడు. నా భార్య అక్రమ సంబంధం వల్ల నాకు జీవితంపై విరక్తి కలిగింది. ఆమె ప్రవర్తనకు సంబంధించి నా వద్ద ఆధారాలు ఉన్నాయి. నన్ను తీవ్రంగా బాధపెట్టినందుకే నా కూతుళ్లను నాతో పాటు తీసుకువెళ్తున్నానని లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా తీవ్ర వివాదాలు నడుస్తున్నాయని.. ముఖ్యంగా ఇద్దరు పిల్లల సంరక్షణ హక్కును ఇమ్రాన్ తనకే కావాలని పట్టుబట్టగా, భార్య, కుటుంబ సభ్యులు దానికి అంగీకరించలేదని విచారణలో తేలింది. ఇమ్రాన్ భార్యను కూడా పోలీసులు ప్రశ్నించగా వారి మధ్య కస్టడీ వివాదం ఉన్నట్లు ఆమె ధృవీకరించారు. పిల్లల ప్రాథమిక వైద్య పరీక్షల ఆధారంగా గొంతు నులిమి చంపినట్లు భావిస్తున్నామని.. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎయిర్పోర్ట్ పోలీసులు వెల్లడించారు.