Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే.. రూ.4.5 లక్షల కోట్ల పథకాలకు గ్రీన్ సిగ్నల్.. రైతులు, యువతకు కేంద్రం వరాలు..
రైతుల సంక్షేమం, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి, క్రీడారంగ ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రూ.4.51 లక్షల కోట్లకు పైగా విలువైన పలు పథకాలకు ఆమోదం లభించింది.
Cabinet Decisions: రైతుల సంక్షేమం, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి, క్రీడారంగ ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రూ.4.51 లక్షల కోట్లకు పైగా విలువైన పలు పథకాలకు ఆమోదం లభించింది. ఇందులో పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించడం, పీఎం-సూర్య సరోవర్ యోజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం,రూ.36,441 కోట్లతో పునర్వ్యవస్థీకరించిన ఖేలో ఇండియా పథకానికి ఆమోదం వంటి కీలక నిర్ణయాలు ఉన్నాయి. ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
రైతులకు ఊరటనిచ్చే నిర్ణయంగా పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2026-27 నుంచి 2030-31 వరకు మరో ఐదేళ్లపాటు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రూ.3.15 లక్షల కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి భూ యజమాని రైతు కుటుంబానికి ఏటా రూ.6,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ యథావిధిగా కొనసాగనుంది.
దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో 'సముద్ర మంథన్' జాతీయ ఆఫ్షోర్ అన్వేషణ పథకానికి రూ.84,084 కోట్లను కేబినెట్ ఆమోదించింది. లోతట్టు సముద్ర ప్రాంతాల్లో చమురు, సహజవాయువు అన్వేషణ, డ్రిల్లింగ్, డేటా సేకరణ, సముద్రతీర మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా కొత్త ఇంధన నిల్వలను వెలికితీయడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారుల ప్రతిభను మరింత పెంపొందించేందుకు పునర్వ్యవస్థీకరించిన ఖేలో ఇండియా పథకానికి రూ.36,441 కోట్లను కేటాయించారు. ఇది గత కేటాయింపులతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ. దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, ప్రతిభావంతులైన క్రీడాకారులకు శిక్షణ, 2030 కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్, పారాలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడలకు భారత్ సిద్ధమయ్యేలా ఈ నిధులను వినియోగించనున్నారు.
అదే సమయంలో పునరుత్పాదక ఇంధన రంగానికి ఊతమిస్తూ పీఎం-సూర్య సరోవర్ యోజనకు రూ.5,070 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం ద్వారా దేశంలో 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జలాశయాలు, చెరువులపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని పెంచడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ఈ పథకం కీలకంగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.